వరంగల్, డిసెంబర్ 27(నమస్తేతెలంగాణ): యాసంగి పంట పెట్టుబడి కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా బుధవారం నుంచి రైతులకు రెండో విడుత ఆర్థిక సాయం పంపిణీ చేయనుంది. నేరుగా అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు నిధులు విడుదల చేసింది. దీంతో తొలిరోజు జిల్లాలో 56,244 మంది రైతులకు రైతుబంధు పథకం నుంచి రూ. 16,65,25,165 పంట పెట్టుబడి సాయం అందనుంది. రైతుకు దన్నుగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేని రీతిలో రైతుబంధు పథకాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా పంట పెట్టుబడి కోసం ఏటా రెండు విడుతల్లో ఎకరానికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నది.
ఇప్పటికే తొమ్మిది విడుతల్లో రాష్ట్రంలోని రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు పథకం ద్వారా రూ. 58 వేల కోట్ల పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం జమ చేసింది. పదో విడుత ప్రస్తుత యాసంగిలో సుమారు 65 లక్షలపైగా మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ. 7,600 కోట్ల ఆర్థిక సాయం జమ చేయనుంది. దీంతో పది విడుతల్లో రైతుబంధు పథకం నుంచి రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అందజేసిన పంట పెట్టుబడి సాయం సుమారు రూ. 66 వేల కోట్లకు చేరనుంది. జిల్లాలో ఈ పథకం ద్వారా ఏటా ప్రతి వానకాలం, యాసంగి సీజన్లో సుమారు 1.44 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది వీరికి గత వానకాలం తొలి విడుత రైతుబంధు పథకం నుంచి ఎకరానికి రూ. 5 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేసింది. ఈ యాసంగి సాగుకు రైతులు సన్నద్ధమైన నేపథ్యంలో రైతుబంధు పథకం ద్వారా రెండో విడుత పంట పెట్టుబడి సాయాన్ని ఈ నెల 28 నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎకరానికి రూ. 5 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఈ నెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దీంతో మొదట ఎకరం భూమిలోపు ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు పథకం ద్వారా పంట పెట్టుబడి సాయాన్ని బుధవారం నుంచి జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. ప్రస్తుత యాసంగి 1,44,221 మంది జిల్లా రైతులకు రూ. 132,54, 85,928 పంట పెట్టుబడి సాయం అందనుంది. తొలిరోజు బుధవారం వీరిలో 56,244 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 16,65,25,165 జమ కానుందని జిల్లా జేడీఏ ఉషాదయాళ్ తెలిపారు. రెండో రోజు రెండు, మూడో రోజు మూడెకరాల్లోపు వ్యవసాయ భూమి గల రైతులు, ఇలా రైతులందరికీ రైతుబంధు పథకం నుంచి పంట పెట్టుబడి సాయం అందనుంది. రోజువారీగా ఈ పథకం నుంచి ఆర్థిక సాయం పొందే రైతుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. కొద్దిరోజుల నుంచి ఎదిరిచూస్తున్న పంట పెట్టుబడి సాయం బుధవారం నుంచి అందనుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యాసంగి సీజన్ ఆరంభంలో దుక్కులను దమ్ము చేసేందుకు, విత్తనాలు, ఎరువులు, ఇతర ఖర్చులకు ఈ రైతుబంధు ఆర్థిక సాయం ఎంతో ఉపయోగపడనుందని సంబురపడుతున్నారు.
వర్ధన్నపేట: యాసంగి పంట సాగు చేసే సమయానికి రైతుబంధు సాయం అందుతాంది. గతంలో భూములను దున్నుకునేందుకు, ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసుకునేందుకు అప్పులు తెచ్చుకునేటోళ్లం. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకం పెట్టినప్పటినుంచి అప్పులు తెచ్చుకునుడు బందైంది. పంట పండించుకునే సమయానికే పైసలు బ్యాంకు ఖాతాళ్ల పడుతుండడంతో అప్పుల కోసం పోతలేం. గతంల అప్పులు తెచ్చి మిత్తిలు కట్టడానికే పంట డబ్బులు సరిపోయేది. ఇప్పుడు అప్పులు తేకపోవడం వల్ల పంట డబ్బులు మిగులుతానై. మా పొళ్లగాండ్లను సదువించుకుంటానం. ప్రభు త్వం రైతులకు అన్ని మంచిగ చేస్తాంది. చిన్న రైతులకు రైతు బంధుతోటి మేలు జరుగుతాంది. పంటలు మంచిగ పండుతానై. రైతులంతా ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు రుణపడి ఉంటరు.
– భూక్యా రామచంద్రు, రైతు, వర్ధన్నపేట
ఖానాపురం: రైతుబంధు పథకం ద్వారా రైతులకు ఏటా ఎకరాకు రూ. 10 వేలు అందిస్తూ సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడయ్యాడు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మాచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. చిన్న, సన్న కారు రైతాంగం ఒకప్పుడు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగేది. కానీ, నేడు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకంతో రైతులు ధైర్యంగా తలెత్తుకుని వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ఏటా రెండు పంటలు పండించుకుంటూ రైతన్నలు దేశానికి అన్నం పెట్టే పరిస్థితికి ఎదుగుతున్నారు. రైతులను ఇంతగా ఆదుకున్న ప్రభుత్వాలు గతంలో ఏనాడు చూడలేదు. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు రైతులమంతా రుణపడి ఉంటాం. – కుంచారపు వెంకట్రెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్, ఖానాపురం