HomeWarangal-ruralRythu Bandhu Cash Continues To Be Deposited In Farmers Bank Accounts In The District
11,738 మందికి రైతుబంధు
రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా రైతులకు యాసంగి పంట పెట్టుబడి సాయం అందిస్తున్నది.
బ్యాంకు ఖాతాల్లో రూ.20,32,56,981 జమ
ఇప్పటికే 1,30,669 మందికి అందిన రూ.95,29,38,201 పెట్టుబడి సాయం
యాసంగిలో జిల్లాలో 1,44,390
మందికి అందనున్న రూ.132కోట్లు
జిల్లాలో రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు నగదు జమ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం యాసంగి పంట పెట్టుబడి సాయం (పదో విడుత) అందిస్తున్నది. ఇది డిసెంబర్ 28న ప్రారంభించగా నాలుగు ఎకరాల్లోపు ఉన్న రైతులకు ఇవ్వడం పూర్తయ్యింది. మంగళవారం ఐదు ఎకరాల్లోపు ఉన్న 11,738 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరానికి రూ.5వేల చొప్పున రూ.20,32,56,981 జమ చేసింది. బుధ ఆరు, గురు ఏడు ఎకరాల్లోపు రైతులకు రానున్నాయి. అదునుకు సాయం అందుతుండడంతో రైతులు ఆనందపడుతున్నారు.
– వరంగల్, జనవరి 3 (నమస్తే తెలంగాణ)
వరంగల్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా రైతులకు యాసంగి పంట పెట్టుబడి సాయం అందిస్తున్నది. మంగళవారం వరకు జిల్లాలో సుమారు 1,30,669 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ.95,29,38,201 జమ చేసింది. ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఏటా రెండు విడుతల్లో రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ ఏడాది వానకాలం ఎకరానికి రూ.5వేల చొప్పున అందజేసింది. ప్రస్తుత యాసంగికి ఎకరానికి మరో రూ.5వేలు డిసెంబర్ 28 నుంచి అందించడం ప్రారంభించింది. తొలిరోజు ఎకరంలోపు వ్యవసాయ భూమి గల రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది.
రెండోరోజు రెండు ఎకరాలు, మూడోరోజు మూడు ఎకరాలు, నాలుగో రోజు నాలుగు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఎకరానికి రూ.5వేల చొప్పున అందించింది. మంగళవారం జిల్లాలో ఐదు ఎకరాల్లోపు ఉన్న 11,738 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరానికి రూ.5వేల చొప్పున రూ.20,32,56,981 జమ చేసింది. ఈ మేరకు సదరు రైతుల మొబైల్స్కు సమాచారం వచ్చింది. జిల్లాలో రైతుబంధు పథకం ద్వారా ఈ యాసంగి 1,44,390మంది రైతులకు రూ.132,68,63, 167 అందనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.
బుధవారం ఆరు, గురువారం ఏడు ఎకరాల్లోపు గల రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కావడంతోపాటు ఇలా కొద్దిరోజుల్లో రైతులందరికీ అందనుంది. రైతుబంధు నగదు అదునుకు అందిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మందులు కొనుగోలు చేస్తున్నారు. యాసంగి వరినాట్లు వేస్తున్న రైతులకు దుక్కి దమ్ము, కూలీలు, ఇతర ఖర్చులకు రైతుబంధు డబ్బులు ఉపయోగపడుతున్నాయి.