ములుగు, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : మే డారం భక్తులు తిరుగు ప్రయాణంలో నరకం చూశా రు. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం తెల్లవారుజాము వరకు భక్తులు ఆర్టీసీ బస్సుల్లోనే గడిపారు. శనివారం కూడా పలుమార్లు ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైంది. తల్లుల దర్శనం కోసం లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు రోదనలు తిరుగు ప్రయాణంలో మిన్నంటాయి. పిల్లాపాపలతో భక్తులు కకావికలం అయ్యారు. రాత్రి వేళ అంధకారంలో ఆకలి, దాహం తో అలమటించారు. రాష్ట్ర ప్రభుత్వం మేడారం భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామంటూ ఆర్భాటంగా ప్రకటించింది. కానీ ఆచరణలో వైఫల్యం చెందినట్లు భక్తులు ఎదుర్కున్న ఇబ్బందులు స్పష్టం చేశాయి. తిరుగు ప్రయాణంలో మేడారం బస్స్టేషన్ నుంచి తగిన బస్సులను ఏర్పాటు చేసి మార్గ మధ్యంలో ట్రాఫిక్ జాం కాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం యంత్రాంగం ఎక్కడ కూడా చొరవ తీసుకోలేదు.
ప్రభుత్వంపై ఆగ్రహం..
భక్తులు అటవీ మార్గంలో ఆర్టీసీ బస్సుల్లోనే ఉండి పోవడంతో ఆగ్రహానికి గురయ్యారు. అధికార యంత్రాంగం కన్నెత్తి కూడా చూడకపోవడం, కనీసం ట్రాఫిక్ క్లియర్కు చర్యలు తీసుకోకపోవడంతో కటిక చీకటిలోనే భక్తులు భయంతో గడిపారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి సీతక్క డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీ తీరుపై దుమ్మెత్తి పోశారు. జాతర చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదని వాపోయారు. చిన్న పిల్లలు ఆకలి, దూపకు అలమటించారు. మహిళలకు ఉచిత బస్సులు ఎవరు పెట్టమన్నారని, ఫ్రీ పెట్టి రెండింతలు బస్సు చార్జీలు వసూలు చేశారని, కనీసం బస్టాండులో మరుగుదొడ్లు, తాగునీటి వసతి కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ జాంతో మేడారానికి బస్సులు రాకపోవడంతో బస్టాండ్ మొత్తం భక్తులతో నిండిపోయింది. చిన్నపిల్లలు, కుటుంబ సభ్యులు తప్పిపోగా వారి కోసం వెతుకులాట కొనసాగింది. తాగునీటి కోసం తండ్లాడారు. కూర్చునే అవకాశం లేకపోవడంతో వృద్ధులు, పిల్లలు గంటల కొద్దీ నిలబడి సొమ్మసిల్లి పడిపోయారు. ఈ సమయంలో పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి వెళ్లగా భక్తులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి కన్పించింది.
30 కిలోమీటర్లు.. 14 గంటలు
మేడారం బస్ స్టేషన్ నుంచి పస్రా, ఏటూరునాగారం మార్గంలో శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి శనివారం తెల్లవారు జాము వరకు ట్రాఫిక్ స్తంభించింది. మేడారం బస్టాండ్ నుంచి బయలు దేరిన బస్సులు కిలోమీటర్ దూరం కదలక ముందే నిలిచిపోయాయి. 30 కిలోమీటర్ల మేర 14 గంటలకు పైగా ఆయా రూట్లలో ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. హనుకొండ, భధ్రాచలం వైపు నుంచి వచ్చే వాహనాలు, బస్సులు మార్గ మధ్యంలోనే నిలిచిపోయాయి. అటవీ మార్గంలో సరైన కమ్యూనికేషన్ లేకపోవడంతో తాము ఎక్కడ ఉన్నాం? ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుంది? ఎప్పుడు ఇంటికి చేరుకుంటాం? అనే విషయాలు తెలియక భక్తులు ఆందోళన చెందారు.
అడ్రస్ లేని అధికారులు
తీవ్రంగా ట్రాఫిక్ జాం అయినప్పటికీ అధికారులు ట్రాఫిక్ జాం వైపు కన్నెత్తి చూడలేదు. జాత ర విధుల్లో అనుభవం లేని అధికారులకు విధులు కేటాయించడంతో జాతర నిర్వహణ అదుపు తప్పింది. ఇటు ట్రాఫిక్ జాం, అటు గద్దెల వద్ద తోపులాటల విషయంలో పోలీసు శాఖ వైఫల్యం చెందినట్లయింది. గతంలో మేడారం జాతర నిర్వహణలో అనుభవమున్న సీనియర్ అధికారులకు బాధ్యతలు అప్పగించడంతో పాటు సలహాలు సూచనలు పాటించే వారు. జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీకి గత అనుభవం లేకపోవడంతోనే సమస్యలు తలెత్తినట్లుగా భక్తులు భావిస్తున్నారు. రూ. 250 కోట్లతో జాతర అభివృద్ధి పనులు చేపట్టిన క్రమంలో భక్తులకు సౌకర్యాలు మెరుగు పడాల్సింది పోయి 2004 నాటి జాతర పరిస్థితులు తలెత్తడం విమర్శలకు దారితీసింది.