న్యూశాయంపేట, డిసెంబర్ 5: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన పాత్ర మరిచిపోలేమని, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సి ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ హంటర్రోడ్డులోని అభిరామ్ గార్డెన్లో జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అధ్యక్షతన జరిగింది.
అమరులైన జర్నలిస్టులకు ఒక్క నిమిషం మౌనం పాటించి నివాళులు అర్పించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర కాంక్షను తెలంగాణ జర్నలిస్టులే దేశవ్యాప్తంగా వినిపించారని అన్నారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడేందుకు జర్నలిస్టులు చూపిన తెగువకు ప్రపంచమే నీరాజనం పలికిందన్నారు. సీమాంధ్ర ఏలుబడిలో అణిచివేతకు గురైన సమాజాన్ని ప్రజల జీవనస్థితి గతులను ప్రపంచానికి చూపిన ఘనత తెలంగాణ జర్నలిస్టులదే అన్నారు. చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ ఉద్యమ సమయంలో వెన్నంటి నిలిచిన ప్రతి జర్నలిస్టుకు రుణపడి ఉంటానన్నారు.
ఉద్యమంలో తనకు నిలిచినది వరంగల్ జర్నలిస్టులే అన్నారు. ప్రత్యేక రాష్ట్ర కాంక్షలో పూర్తిగా మునిగి అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ పిలుపునందుకుని రాజీనామా చేసిన ప్రతి సందర్భంలో తనకు అఖండ మెజార్టీ కట్టబెట్టి ‘నువ్వు ముందు నడువు అన్నా.. మేము మీ వెనకాలే ఉంటాం’ అని ధైర్యాన్నిచ్చిన జర్నలిస్టు మిత్రులను తానెప్పుడు మరిచిపోనన్నారు. ఈరోజు చీఫ్ విప్గా తాను ఉద్యమంలో గడిపిన గతమే తన జీవితానికి మధురానుభూతి మిగులుస్తోందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజర్ టంకశాల ఆశోక్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని నలుదిశలా వ్యాపింపజేసిన ఘనత జర్నలిస్టులదని అన్నారు. వరంగల్ జర్నలిస్టుల పాత్ర తెలంగాణలో కీలకమని, 1969 ఉద్యమంలో సైతం అనేక పత్రికలు వరంగల్ వేదికగా వెలువడ్డాయని, ఆంధ్ర పత్రికలు అయినప్పటీకి తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు రాశారని గుర్తుచేశారు. ఎంతోమంది మహానుభావులు చేసిన త్యాగాలను జర్నలిస్టులతో పంచుకున్నారు. కుడా చైర్మన్ కుడా మర్రి యాదవరెడ్డి, సీనియర్ జర్నలిస్టులు పల్లె రవి, టీయూడబ్ల్యూజే 143 సెక్రటరీ మారుతీసాగర్ పాల్గొన్నారు.