హనుమకొండ సిటీ, సెప్టెంబర్ 3 : ఏడాది ప్రారంభంలో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కాగా, కోర్టు మధ్యంతర ఉత్తర్వులతో బ్రేక్ పడింది. తిరిగి ఉత్తర్వులను హైకోర్టు ఉపసంహరించుకోవడంతో శుక్రవారం బదిలీల ప్రక్రియకు విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఉపాధ్యాయులు ఈ నెల 3వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆదివారం నుంచి ఉపాధ్యాయులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం షురూ చేశారు. జనవరిలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆయా కేటగిరీల్లో 1300 మంది దరఖాస్తు చేసుకోగా, తాజాగా ప్రకటించిన కటాఫ్ తేదీ సెప్టెంబర్ 1వ తేదీ నాటికి 432 మంది ఉపాధ్యాయులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ గుర్తించింది. ఐదేళ్లు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు కటాఫ్ తేదీ సెప్టెంబర్ 1గా నిర్ణయించారు.
ఉద్యోగ విరమణకు ఇంకా మూడేళ్ల సర్వీస్ మాత్రమే ఉన్న వారికి ప్రభుత్వం బదిలీల నుంచి మినహాయింపు కల్పించింది. 432 మందిలో 35 మంది గెజిటెడ్ హెచ్ఎంలు,138 మంది సూల్ అసిస్టెంట్లు, 259 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో 355 మంది ఉపాధ్యాయులు ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా, ఇంకా 77మంది చేసుకోవాల్సి ఉంది. మొదటి షెడ్యూల్కు, ఇప్పటి షెడ్యూల్కు మధ్య తొమ్మిది నెలల వ్యవధి ఉండడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
జిల్లాలో 2,693 ఉపాధ్యాయ పోస్టులు..జిల్లాలో 2,693 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తించాల్సి ఉండగా, ప్రస్తుతం 2,375 మంది ఉన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ అనంతరం పూర్తి వివరాలు తెలియనున్నాయి.
షెడ్యూల్ వివరాలు..
ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కొత్తవారు దరఖాస్తు చేసుకోవడం.. గతంలో దరఖాస్తు చేసుకున్నవారు వారు ఎడిట్ చేసుకునే అవకాశం.. ఆ తర్వా త సీనియారిటీ జాబితా వెల్లడి.. అనంతరం ప్రధానోపాధ్యాయుల బదిలీలు.. ఆ స్థానంలో సూల్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతులు.. అనంతరం సూల్ అసిస్టెంట్ల బదిలీలు.. ఆ స్థానంలో ఎస్జీటీలకు ఉద్యోగోన్నతి కల్పించడం.. చివరిగా అభ్యంతరాలకు అవకాశం కల్పించారు. కాగా, ఈ ప్రక్రియ మొత్తం నెల రోజుల వ్యవధిలో ముగియనున్నది.