హనుమకొండ, ఏప్రిల్ 3 : సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారాయా?, ప్రజల సొమ్ముతో నెలనెలా రూ.లక్షల్లో వేతనాలు పొందుతున్న కొందరు అధికారులు పెడదారి తొక్కుతున్నారా? అంటే ఏసీబీ అధికారులు జరిపిన తనిఖీల్లో పెద్దమొత్తంలో పట్టుబడిన నగదు, బంగారం, వెండి చూస్తే అవుననే అనిపిస్తున్నది. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల ఇండ్లలో ఏసీబీ అధికారులు రెండు రోజులుగా జరిపిన సోదాల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.
హనుమకొండ వడ్డేపల్లి వందఫీట్ల రోడ్డులోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వరంగల్ ఆర్వో కార్యాలయంలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లకు సంబంధించి హనుమకొండ, ఖమ్మం జిల్లాల్లో చేపట్టిన తనిఖీల్లో అధికారులు, ప్రైవేట్ వ్యక్తుల మధ్య జరుగుతున్న చీకటి దందా బట్టబయలైంది. వీరి మధ్య ఏడాది కాలంగా ఫోన్ పే ద్వారా సుమారు రూ.42 లక్షల వరకు లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.
అంతేకాక ఆక్మసికంగా తనిఖీలకు వెళ్లిన సమయంలో కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లు, ఏజెంట్లు కలిసి మొత్తం 20 మంది ఉండడంతో ఏసీబీ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. అలాగే, రిజిస్ట్రేషన్ పూర్తయిన 204 డాక్యుమెంట్లను సబ్ రిజిస్ట్రార్లు తమ వద్దే పెట్టుకోవడం విశేషం. మొత్తం మీద రెండు రోజులుగా జరుగుతున్న సోదాలతో వడ్డేపల్లిలోని వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, సబ్ రిజిస్ట్రార్లకు డాక్యుమెంట్లకు ఇచ్చే డబ్బులు శుక్రవారం ఇస్తారని, ఆ రోజు తనిఖీలు చేస్తే లక్షల రూపాయలు దొరికేవని, గురువారం కావడంతో వేలల్లో మాత్రమే దొరికాయనే ప్రచారం ఉంది. ఈ అవినీతి బాగోతం మొత్తం దళారుల మొబైల్ ఫోన్ సందేశాల ఆధారంగా వెలుగులోకి రావడం గమనార్హం. రిజిస్ట్రేన్కు సంబంధించి ఒక్కొక్క డాక్యుమెంట్కు ఎంత వసూలు చేయాలో ఎస్ఆర్వోలు ఏజెంట్లకు వాట్సాప్ ద్వారా సమాచారం అందిస్తే.., వారు వసూలు చేసిన డబ్బులను అధికారులకు అప్పగించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు జమలాపురం రామనర్సింహారావు (ఎస్ఆర్వో -1), దావులూరి ఆనంద్ (ఎస్ఆర్వో -2)లు విధులు నిర్వర్తిస్తున్న కార్యాలయంతోపాటు హనుమకొండ, ఖమ్మంలోని వారి ఇండ్లలో ఏసీబీ అధికారులు చేసిన సోదాల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్ఆర్వోలు అవినీతి అక్రమాలు బయడపడ్డాయి.
కళ్లు చెదిరేలా అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కార్యాలయాన్ని తనిఖీ చేసిన సమయంలో 20మంది అనధికార ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లు గుర్తించారు. నగదు లెక్కల్లో చూపించని రూ. 47,450, నమోదు చేయని 70 పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, డాక్యుమెంట్ రైటర్ల మొబైల్ ఫోన్లు పరిశీలించగా ఎస్ఆర్వోల మధ్య వాట్సాప్ చాట్స్, ఫోన్ పే ద్వారా ఏడాది కాలంలో సుమారు రూ. 42,03,125 లావాదేవీలు జరిగినట్లు, ఎస్ఆర్వోల వద ్ద డెలివరీ చేయని రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు 204 ఉన్నట్లు గుర్తించారు.
నివాసాల్లో తనిఖీ చేయగా రూ. 24,61,540 నగదు, 819.500 గ్రాముల బంగారు ఆభరణాలు, 2.600 కిలోల వెండి ఆభరణాలు, ఎస్ఆర్వో ఆనంద్ పేరిట కపిల్ చిట్ఫండ్స్లో రూ. 30.10లక్షల విలువ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించి అన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఇవేకాకుండా తనిఖీల్లో మరిన్ని అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపించి తగిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.