భూపాలపల్లి టౌన్, ఏప్రిల్ 9: మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తున్నది. బ్యాంకు లింకేజీ ద్వారా వడ్డీ లేని, స్వల్ప వడ్డీతో రుణాలను అందిస్తుండగా మహిళలు పలు రకాలుగా స్వయం ఉపాధి పొందుతున్నారు. తాజాగా జాతీయ జీవనోపాధుల మిషన్ ఆధ్వర్యంలో లక్పతి దీదీ యాప్ను రూపొందించగా, అందులో మహిళా సంఘాల సమగ్ర సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. సభ్యుల ఆదాయం, తీసుకున్న రుణాలు, ప్రగతి, ఇతర వివరాలన్నీ నమోదు చేసి, వాటి ఆధారంగా ఉన్నతాధికారులు నిర్ణయాలు తీసుకోనున్నారు. జయశంకర్ జిల్లాలో నమోదు ప్రక్రియ ఇప్పటివరకు 24శాతం పూర్తవగా, టేకుమట్ల, రేగొండ మండలాల్లో చురుగ్గా, మల్హర్, పలిమెల, మహదేవ్పూర్ మండలాల్లో కొనసాగుతున్నది.
మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగతంగా మహిళలను బలోపేతం చేసేందుకు వడ్డీలేని, స్వల్ప వడ్డీ రుణాలను మంజూరు చేస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 367 గ్రామైక్య సంఘాలు, 8,058 స్వయం సహాయక సంఘాలు, 88వేల మంది సభ్యులు ఉండగా, గత ఆర్థిక సంవత్సరం రూ.188కోట్ల లక్ష్యానికి గాను రూ.189కోట్లు, ఈ ఏడాది రూ.262.04కోట్ల రుణాల మంజూరు లక్ష్యానికి రూ.187.78కోట్లు మంజూరయ్యాయి. రుణాలను సకాలంలో చెల్లించి తిరిగి రుణాలు పొందుతూ రెగ్యులర్గా ఉన్న స్వయం సహాయక సంఘాలకు అధికారులు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు తోడ్పాటు అందిస్తున్నారు.
యాప్లో పూర్తి వివరాలు
జాతీయ మిషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం రూపొందించిన లక్పతి దీదీ యాప్లో మహిళా సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరుస్తారు. మహిళా సంఘాలు తీసుకున్న బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల వివరాలు, తీసుకున్న రుణాలతో ఏ మేరకు ప్రగతిలో ఉన్నాయి, సభ్యుల ఆదాయ వివరాలు ఇందులో నమోదు చేస్తారు. మహిళలు పొదుపు సంఘంలో చేరాక ఆర్థిక పరిస్థితుల్లో ఏవైనా మార్పులున్నాయా? ఎన్నిసార్లు రుణాలు తీసుకున్నారు? వాయిదాల చెల్లింపులు ఎలా ఉన్నాయి? తదితర వివరాలను ఇందులో నిక్షిప్తం చేస్తారు. ఇందులో సమగ్ర సమాచారం ఉండడంతో ప్రభుత్వం పొదుపు సంఘాల అభ్యున్నతికి నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది. రుణాలు చెల్లించని సంఘాల వివరాలను అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుని హెచ్చరించేందుకు ఈ యాప్ ఉపయోగకరంగా ఉంటుంది.
కొనసాగుతున్న నమోదు ప్రక్రియ
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహిళా సంఘాల వివరాల నమోదు ప్రక్రియ 24శాతం పూర్తయ్యింది. జిల్లాలో మొత్తం మహిళా సంఘాల్లో 92,638 కుటుంబాలు ఉండగా, ఇప్పటివరకు అధికారులు 22,503 కుటుంబాలను సర్వే చేసి యాప్లో నమోదు చేశారు. ఈ ప్రక్రియ టేకుమట్ల, రేగొండ మండలాల్లో చురుగ్గా సాగుతుండగా, మల్హర్, పలిమెల, మహదేవ్పూర్ మండలాల్లో వెనుకంజలో ఉంది. మల్హర్ మండలంలో 2శాతం, పలిమెలలో 2శాతం, గణపురంలో 7శాతం, మహదేవ్పూర్లో 9శాతం, మొగుళ్లపల్లిలో 19శాతం, చిట్యాలలో 21శాతం, కాటారంలో 22శాతం, భూపాలపల్లిలో 24శాతం, మహాముత్తారంలో 25 శాతం, రేగొండలో 46శాతం, టేకుమట్లలో 62శాతం నమోదు ప్రక్రియ పూర్తయింది.
యాప్లో పూర్తి వివరాలు
లక్పతి దీదీ యాప్పై క్షేత్రస్థాయిలో సిబ్బందికి ఇప్పటికే కల్పించాం. అందులో వివరాల నమోదు ప్రక్రియ 24శాతం పూర్తయ్యింది. ఇంకా ప్రక్రియ కొనసాగుతున్నది. అందులో గ్రూపునకు సంబంధించిన రుణాలు, ఇతర వివరాలు నమోదు చేయడం వల్ల పారదర్శకత ఉంటుంది. వివరాల ఆధారంగా ఉన్నతాధికారులకు సంఘాల ప్రగతిపై నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది. – పురుషోత్తం, డీఆర్డీవో