వరంగల్, జూలై 28(నమస్తేతెలంగాణ): ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలమైన ఓరుగల్లు క్రమేనా తేరుకుంటున్నది. పల్లెలు, పట్టణాలను ముంచెత్తిన వరద తగ్గుముఖం పట్టింది. ఇండ్లలోకి వచ్చిన నీరు బయటకు వెళ్లిపోయింది. దీంతో శుక్రవారం సాధారణ పరిస్థితి కనపడింది. జనం తమ ఇండ్ల నుంచి బయటకొచ్చారు. రహదారులన్నీ రద్దీగా మారాయి. ఒక్కరోజులోనే తిరిగి మామూలు వాతావరణం నెలకొనడంతో తమ పనుల్లో నిమగ్నమయ్యారు.
ప్రధానంగా జిల్లాకేంద్రమైన వరంగల్లో పలు కాలనీలు గురువారం జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద నీరు చుట్టుముట్టిన ఇండ్ల నుంచి ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్ టీంలు ట్రాక్టర్లు, బోట్ల ద్వారా కొందరిని వరదలో నుంచి బయటకు తీసుకొచ్చారు. పోలీసులు, అగ్నిమాపక, బల్దియా సిబ్బంది సాయం కోసం ఎదిరిచూస్తున్న పలువురిని వరద నీటిలో నుంచి సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు అధికారులు భోజన వసతి కల్పించి దుప్పట్లను అందజేశారు. బల్దియా పరిధిలోకి వచ్చే జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో 15 పునరావాస కేంద్రాలు, వర్ధన్నపేట, పర్వతగిరి, నెక్కొండ, దుగ్గొండి, నర్సంపేట మండలాల్లో ఒక్కో పునరావస కేంద్రం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పీ ప్రావీణ్య వెల్లడించారు. ఈ 20 కేంద్రాల్లో 2,789 మంది బాధితులు ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపారు.
ముంపునకు గురైన ఇండ్లలోని వరద నీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రమేణా బయటకు వెళ్లిపోయింది. గురువారం తమ ఇండ్లకే పరిమితమైన లోతట్టు ప్రాంతాల కాలనీల్లోని ప్రజలు శుక్రవారం బయటకొచ్చారు. దుకాణాలకు చేరుకుని నిత్యావసర సరుకులను కొనుగోలు చేశారు. ఫలితంగా గురువారం బోసిపోయిన రహదారులు శుక్రవారం రద్దీగా కనపడ్డాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకున్నాయి. మునుపెన్నడూ లేని రీతిలో రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షానికి జలమయమైన లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు 24 గంటల వ్యవధిలోనే తేరుకోవడం, సాధారణ పరిస్థితి చోటుచేసుకోవడం విశేషం. తమ ఇండ్లు, వస్తువులను బాధితులు శుభ్రం చేసుకున్నారు. ఎన్పీడీసీఎల్ అధికారులు విద్యుత్ను పునరుద్ధరించారు.
వరద బాధితులకు ప్రజాప్రతినిధులు అండగా నిలిచి మేమున్నామంటూ వారికి ధైర్యాన్ని చెబుతున్నారు. శుక్రవారం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కార్పొరేటర్ గందె కల్పనా నవీన్తో కలిసి హంటర్రోడ్డులోని సంతోషిమాత కాలనీ పరిసరాల్లో పర్యటించారు. శివనగర్ ముంపు బాధితులకు ఇక్కడి కేపీఎస్ ఫంక్షన్ హాలులో పునరావాసం కల్పించారు. ఆయన ఆహార ప్యాకెట్లు అందించారు. ఉర్సు సమీపంలోని నాని గార్డెన్లో బాధితులకు శ్రీకాశీవిశ్వేశ్వర అయ్యప్ప భక్త మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్యే నరేందర్ బాధితులకు వడ్డించారు. ఉర్సు కరీమాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావస కేంద్రానికి చేరుకుని వరద ముంపు బాధితులను పరామర్శించారు. అనంతరం శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్తో కలిసి ఎమ్మెల్యే వివిధ కాలనీల్లో ట్రాక్టర్ ద్వారా పర్యటించి ఉర్సు ప్రభుత్వ పాఠశాలలోని పునరావస కేంద్రాన్ని సందర్శించారు. వరంగల్ రామన్నపేట వెంకటేశ్వర ఆలయం, రాజశ్రీగార్డెన్స్, శివనగర్లోని కేపీఎస్ కన్వెన్షన్ హాల్, ఎస్ఆర్ఆర్తోటలోని దుర్గ గార్డెన్స్, ఉర్సు కుర్మవాడలోని వెంకటేశ్వర హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావస కేంద్రాలను మేయర్ గుండు సుధారాణి సందర్శించి బాధితులకు ధైర్యం చెప్పారు.వరంగల్ 43వ డివిజన్ పరిధిలోని మంగలమ్మకుంట, జక్కలొద్దిని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సందర్శించారు. పునరావస కేంద్రాల వద్ద బాధితులకు దుప్పట్లు పంపిణీ చేశారు. 29వ డివిజన్ పరిధిలోని రామన్నపేట, రఘునాథ్కాలనీలో ప్రభుత్వ చీఫ్విప్ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ మేయర్ సుధారాణితో కలిసి పర్యటించారు.
వరదల నేపథ్యంలో ప్రభుత్వం పునరావాస కేంద్రాల నిర్వహణపై ఫోకస్ పెట్టింది. వీటి నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సహాయక చర్యల కోసం స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. అల్పాహారం, భోజనం, తాగునీరు అందిస్తున్నారు. కలెక్టర్ ఈ కేంద్రాల నిర్వహణను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం ఆమె పలు పునరావస కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లపై ప్రత్యేక అధికారులకు సూచనలు చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వైద్య శిబిరాలు నిర్వహించారు. డీఎంహెచ్వో వెంకటరమణ శిబిరాలను పర్యవేక్షించారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే గిరిప్రసాద్కాలనీ, బీఆర్నగర్, హంటర్రోడ్డు, మైసయ్యనగర్, చింతల్, రాజశ్రీగార్డెన్, కేపీఎస్ సెంటర్, శివనగర్, ఉర్సు, కరీమాబాద్లో వైద్య శబిరాలను సందర్శించారు.