సుబేదారి, జూన్ 4 : శాంతిభద్రతలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టి, తెలంగాణ పోలీసు శాఖలో సమూల మార్పులు తీసుకొచ్చారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల సందర్భంగా సురక్షా దినోత్సవ పెట్రోకార్స్, బ్లూకోల్ట్స్, శకటాల ర్యాలీని సీపీ ఏవీ రంగనాథ్, కలెక్టర్ సిక్నా పట్నాయక్తో కలిసి వినయ్భాస్కర్ ఆదివారం హనుమకొండలోని పోలీసు కమిషనరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసు వ్యవస్థను మరింత దగ్గర చేయడానికి ఫ్లెండ్లీ పోలీసింగ్ విధానం, నేరాలను కట్టడికి అధునాతన టెక్నాలజీని అందుబాటులో తీసుకువచ్చిందని చెప్పారు. మహిళల రక్షణ కోసం షీ టీంలు, బాధితులకు అండగా భరోసా కేంద్రాలు, పోలీసు ఉద్యోగ నియామకాల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. నేర పరిశోధన కోసం సరికొత్త టెక్నాలజీ, ఘటనా స్థలానికి వెంటనే చేరుకోవడానికి అధునాతన వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిందని తెలిపారు. డయల్ 100తో పోలీసు వ్యవస్థ ప్రజలకు మరింత దగ్గర అయిందన్నారు.
వరంగల్ పోలీసులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఎలాంటి కేసునైనా త్వరగా పరిష్కరిస్తారని ప్రశంసించారు. మత సామరస్యతకు పోలీసులు అంకితభావంతో పనిచేస్తున్నారన్నారు. సీపీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చిందన్నారు. పోలీసులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించిందని, సీసీ కెమెరాలతో నేరస్తులను వెంటనే గుర్తిస్తున్నామని చెప్పారు. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. ప్రజలకు మరింత సేవలు అందించడానికి టీంవర్క్గా పని చేస్తున్నామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పోలీసు శాఖలో అధునాతన టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడంతో ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, డీసీపీలు మురళీధర్, బారి, కరుణాకర్, అడిషనల్ డీసీపీలు సురేశ్, సంజీవ్, ఏసీపీలు కిరణ్కుమార్, శ్రీనివాస్, జితేందర్రెడ్డి, మధుసూదన్ పాల్గొన్నారు.
నగరంలో పోలీసు వాహనాల ర్యాలీ..
సురక్షా దినోత్సవం సందర్భంగా వరంగల్ పోలీసు కమిషనరేట్ వద్ద పెట్రోకార్స్, బ్లూకోర్ట్స్ శకటాల ర్యాలీని చీఫ్విప్ ప్రారంభించారు. ర్యాలీ హనుమకొండ చౌరస్తా, ములుగు రోడ్డు, ఎంజీఎం దవాఖాన, పోచమ్మమైదాన్, ఓ సిటీ వరకు కొనసాగింది. అక్కడి నుంచి మామునూరు పోలీసు శిక్షణ కళాశాల వరకు కొనసాగింది. తిరిగి అక్కడి నుంచి హంటర్ రోడ్డు మీదుగా సుబేదారి, కాజీపేట జంక్షన్ వరకు నిర్వహించారు. ర్యాలీలో షీ టీం, భరోసా శకటాలు ఆకట్టుకున్నాయి.