తాడ్వాయి, జనవరి12 : మేడారంలో సమ్మక్క, సారలమ్మ పూజారులు నేబు శుద్ది పండుగ (గుడిమెలిగే) పండగను నిర్వహించనున్నారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు, వారి కుటుంబ సభ్యులు ఇళ్లను శుద్ది చేసుకుని డోలివాయిద్యాల నడుమ మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకుంటారు. గుడిని శుద్ది చేసిన అనంతరం సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లి గుట్ట గడ్డి, పుట్ట మట్టిని సేకరించి గద్దెకు చేరుకుంటారు.
ఆ గడ్డిని గుడిపై వేసిన అనంతరం సమ్మక్క గద్దెకు మట్టితో అలుకుపూతలు నిర్వహించి దూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. శుద్ది పండగతో మహా జాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు. సమ్మక్కను చిలకలగుట్ట పైనుంచి గద్దెలపైకి తీసుకువచ్చే ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య మహా జాతర ముగిసే వరకు కాళ్లకు చెప్పులు లేకుండా అత్యంత నయమనిష్టలతో పూజలు నిర్వహిస్తుంటారు.
సంక్రాంతి సెలవులు కావడంతో తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాలు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం తల్లుల గద్దెలకు చేరుకుని మొక్కులు చెల్లించారు. తెలంగాణ శాసన సభా మండలి డిప్యూటీ చైర్మర్ బండ ప్రకాశ్ తల్లులను దర్శించుకున్నారు. ఆయనకు పూజారులు, దేవాదాయశాఖ అధికారులు స్వాగతం పలికి గద్దెల వద్దకు తీసుకువెళ్లారు. సమ్మక్క, సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పూజారులు ఆయనకు అమ్మవారి వస్ర్తాలను, ప్రసాదాన్ని అందజేశారు.