వరంగల్, జూన్ 20 (నమస్తేతెలంగాణ) : వరంగల్ జిల్లాలో మక్కల కొనుగోళ్లు ముగిశాయి. మొత్తం 31 కేంద్రాల ద్వారా రూ.54 కోట్ల విలువైన మక్కలను మార్క్ఫెడ్ అధికారులు సేకరించారు. 6,757 మంది రైతుల నుంచి మద్దతు ధరతో 2.77 లక్షల క్వింటాళ్లను కొనుగోలు చేశారు. డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటికే 3,623 మందికి సుమారు రూ.33.77 కోట్ల చెల్లింపులు పూర్తవ్వగా, త్వరలోనే మిగతా వారికి జమ చేస్తామని వెల్లడించారు.
వరంగల్ జిల్లాలో మక్కల కొనుగోళ్లు ముగిశాయి. 6,757 మంది రైతుల నుంచి ప్రభుత్వం 2.77 లక్షల క్వింటాళ్ల మక్కలను కొనుగోలు చేసింది. వీటి విలువ రూ.54.40 కోట్లు. 3,623 మంది రైతులకు సుమారు రూ.33.77 కోట్ల చెల్లింపు జరిగింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మార్క్ఫెడ్ సంస్థ అధికారులు జిల్లాలో 31 మక్కల కొనుగోలు కేంద్రాలను నెలకొల్పారు. వీటిలో పీఏసీఎస్లకు 26, ఎఫ్పీవోలకు 5 కేంద్రాలను కేటాయించారు. మే నెల మొదటి వారంలో ఈ కేంద్రాల్లో మక్కల కొనుగోళ్లను ప్రారంభించారు. చెన్నారావుపేట, పాపయ్యపేట, దుగ్గొండి, గిర్నిబావి, నాచినపల్లి, లక్ష్మీపురం, వెంకటాపురం, ఖానాపురం, నల్లబెల్లి, మూడుచెక్కలపల్లి, నర్సంపేట ఏఎంసీ, గురిజాల, మహేశ్వరం, నెక్కొండ ఏఎంసీ, రెడ్లవాడ, తోపనపల్లి, ఊకల్, మొగిలిచర్ల, ఎలుకుర్తి, గీసుగొండ, వంచనగిరి, వరంగల్ ఏఎంసీ, ఆరెపల్లి, సంగెం, నల్లబెల్లి-1, కాపులకనపర్తి, చింతలపల్లి, పర్వతగిరి ఏఎంసీ-1, పర్వతగిరి ఏఎంసీ-2, చౌటపల్లి, ఏనుగల్, చింతనెక్కొండ, రాయపర్తి ఏఎంసీ-1, రాయపర్తి ఏఎంసీ-2, ఇల్లంద ఏఎంసీ, పెరికవేడు గ్రామంలో ఈ కేంద్రాలు పనిచేశాయి. క్వింటాల్కు రూ.1,962 చొప్పున చెల్లించి ప్రభుత్వం రైతుల నుంచి మక్కలను కొనుగోలు చేసింది. కొనుగోళ్లు పూర్తవడంతో ఈ కేంద్రాలను మూసి వేసినట్లు మార్క్ఫెడ్ సంస్థ జిల్లా మేనేజర్ మహేశ్ వెల్లడించారు. మొత్తం 2,77,287 క్వింటాళ్ల మక్కలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ మక్కల విలువ రూ.54,40,37,094 అని చెప్పారు. మక్కలను అమ్మిన రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.33,77,83,994 చెల్లించిందని, మరో రూ.20,62,53,099 చెల్లించాల్సి ఉందని చెప్పారు. త్వరలోనే ఈ డబ్బును కూడా జమ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
అత్యధికంగా పర్వతగిరిలో..
జిల్లాలో అత్యధికంగా పర్వతగిరి ఏఎంసీ-1 సెంటర్లో మక్కల కొనుగోళ్లు జరిగాయి. ఈ సెంటర్లో 492 మంది రైతుల నుంచి 16,801 క్వింటాళ్ల మక్కలను కొనుగోలు చేసింది. నెక్కొండ ఏఎంసీ కేంద్రంలో 16,688 క్వింటాళ్లు, తోపనపల్లి సెంటర్లో 16,182, దుగ్గొండిలో 16,078, వెంకటాపురం సెంటర్లో 15,161, సంగెం సెంటర్లో 15,102 క్వింటాళ్ల మక్కలను కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నాచినపల్లి కేంద్రంలో 13,164, పెరికవేడులో 12,981, ఊకల్లో 11,114, మొగిలిచర్లలో 10,684, పర్వతగిరి ఏఎంసీ-2 సెంటర్లో 10,086, చౌటపల్లి కేంద్రంలో 10,339, కాపులకనపర్తి సెంటర్లో 9,730, రెడ్లవాడలో 9,628, లక్ష్మీపురంలో 9,338, ఏనుగల్లో 9,061, ఇల్లంద ఏఎంసీ కేంద్రంలో 8,031, గీసుగొండలో 7,712, నల్లబెల్లి సెంటర్లో 7,362, గురిజాలలో 6,912, ఆరెపల్లిలో 6,650, వంచనగిరి సెంటర్లో 6,145, రాయపర్తి ఏఎంసీ కేంద్రంలో 5,784, చింతలపల్లి సెంటర్లో 5,708, నల్లబెల్లి-1 కేంద్రంలో 5,318, చెన్నారావుపేట సెంటర్లో 4,994, నర్సంపేట ఏఎంసీలో 3,877, వరంగల్ ఏఎంసీ సెంటర్లో 3,755, ఎలుకుర్తి కేంద్రంలో 2,893 క్వింటాళ్ల మక్కలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ మక్కలను జిల్లాలోని రాష్ట్ర గిడ్డంగులు, మార్కెటింగ్ శాఖ గోదాముల్లో నిల్వ చేశారు.