గిర్మాజీపేట, డిసెంబర్ 2 : కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీని బొంద పెడతామని ఆల్ ట్రేడ్ యూనియన్ సభ్యులు హెచ్చరించారు. శుక్రవారం ఇసుక లారీల అడ్డా వద్ద సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి, ఏఐటీయూసీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేశ్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంగుల దయాకర్ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజల నడ్డి విరగ్గొడుతున్న బీజీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతోందని, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఇప్పటికే 80 శాతం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టారని.. ఆహార పదార్థాల ప్యాకింగ్పై 5, 12, 15 శాతం ఇలా జీఎస్టీ పెంచిందని గుర్తుచేశారు. దీన్ని ఉపసంహరించుకోకపోతే ప్రజల్లోకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఇనుముల శ్రీనివాస్, ఎండీ మహబూబ్పాషా, సింగారపు బాబు, ఏఐటీయూసీ నాయకులు దండు లక్ష్మణ్, జాన్పాల్, రవి, మూడెడ్ల ఉపేందర్, గున్నాల ప్రభాకర్, ఎస్కే పాషా, రాఘవులు, మీర్సాజియా, అప్పాజీ, వాణి, సరిత తదితరులు పాల్గొన్నారు.
కరీమాబాద్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ఫోర్టురోడ్డులో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెల్లి కృష్ణ మాట్లాడుతూ.. కార్మికుల హక్కులను హరించేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. నూతన విధానాలను అమలు చేస్తూ కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా కేంద్రం వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు.