వెంకటాపూర్, డిసెంబర్ 26 : మండలంలోని పాలంపేటలో యునెస్కో గుర్తిం పు పొందిన రామప్ప ఆలయ సందర్శనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ కృష్ణ అదిత్య తెలిపారు. సోమవారం రామప్పలో ఏఎస్పీ సుధీర్రామ్నాధ్ కేకన్, అదనపు కలెక్టర్ వైవీ గణేశ్తో కలిసి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లడుతూ రాష్ట్రపతి పర్యటన సందర్భంగా రామప్ప ఆలయ అలంకరణ పనులు పూర్తి చేశామన్నారు. ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాష్ట్రపతి పర్యటన ఉంటుందన్నారు.
పార్కింగ్ ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ స్కీం పైలెట్ ప్రాజెక్టు రామప్పలో రాష్ట్రపతి ప్రారంభించనున్నారని కృష్ణ ఆదిత్య వివరించారు. ఆదివాసీ కళాబృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనిపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశామన్నారు. రామప్ప గార్డెన్ను అందంగా తీర్చిదిద్దామని, తాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రామప్ప ప్రాంగణమంతా శానిటైజ్ చేయడంతోపాటు అంతర్గత కీటకాలు ప్రవేశించకుండా బ్లీచింగ్ చేస్తున్నామన్నారు.
రాష్ట్రపతి పర్యటనకు భారీ భద్రత
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా భద్రతా చర్యల్లో భాగంగా రామప్ప పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. రామప్ప ఆలయం ప్రతి భాగాన్ని పర్యవేక్షించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రత ఏర్పాట్లకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కలెక్టర్ కోరారు. రామప్పలో అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేయనున్నామని వెల్లడించారు. మూడు హెలిప్యాడ్లు ల్యాండ్ అయ్యేలా స్థలం కేటాయించామని, తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో రమాదేవి, డీపీవో వెంకయ్య, కేంద్ర పురావస్తు శాఖ సూపరింటెండెంట్ స్మిత ఎస్ కుమారి, ఎఈ కృష్ణ చైతన్య, సీఏ మల్లేశ్, పంచాయతీరాజ్ ఈఈ రవీందర్, ఆర్ అండ్ బి ఈఈ వెంకటేష్, ఇరిగేషన్ ఈఈ వెంకటకృష్ణారావు, డీఈ రవీందర్, తహసీల్దార్ మంజుల, సీఐ రంజిత్ కుమార్, ఎస్సై తాజొద్దీన్ పాల్గొన్నారు.
గంటన్నర నుంచి రెండు గంటలు..
ప్రపంచ వారసత్వ కట్టడమైన రామప్ప ఆలయాన్ని ఈ నెల 28న రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సందర్శించనున్నారు. బుధవారం ఉదయం భద్రాచలంలో పర్యటించి ప్రసాద్ పథకాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రత్యేక హెలీక్యాప్టర్లో రామప్పకు వస్తారని అధికారులు వెల్లడించారు. 2.25 గంటలకు హెలిప్యాడ్ ప్రాంగణంలో రాష్ట్ర, కేంద్ర మంత్రులు, అధికారులు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి 2.30 గంటలకు గార్డెన్ గేటు వరకు కారులో చేరుకుంటారు. 2.32 గంటలకు రాష్ట్రపతి పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. 2.35 గంటలకు రామప్ప ఆలయానికి చేరుకుంటారు. అక్కడ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రులు, కేంద్ర పురావస్తు శాఖ, డీజీ సూపరింటెండెంట్, జిల్లా కలెక్టర్ కృష్ణఅదిత్య, టూరిజం, దేవాదాయ శాఖ అధికారులు స్వాగతం పలుకుతారు.
2.45 గంటలకు రాష్ట్రపతి ముర్ముకు మంగళవాయిద్యాలతో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయ మండపంలో ఆశీర్వచనం అనంతరం టూరిజం గైడ్స్ ద్వారా ఆలయ ప్రాముఖ్యత వివరిస్తారు. 3.15 గంటలకు రామప్ప ఆలయాన్ని దర్శించిన అనంతరం ప్రసాద్ పథకం, కామేశ్వరాలయ పునర్ నిర్మాణ పనుల ప్రారంభం అనంతరం వేదిక వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను రాష్ట్రపతి తిలకించి ప్రసంగిస్తారు. అనంతరం తిరుగు ప్రయాణమవుతారు.