వరంగల్, మార్చి 4(నమస్తేతెలంగాణ) :జిల్లాలో వరుసగా జరుగుతున్న చోరీలను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. విచారణను వేగవంతం చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసుల ఛేదనకు సాంకేతిక పరిజ్ఞానాన్నీ వినియోగిస్తున్నారు. గంగదేవిపల్లి, సుందరయ్యనగర్ వంటి ఘటనలపై ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. లక్నేపల్లి, చలపర్తి సంఘటనలపై ప్రత్యేక నజర్ పెట్టారు. ఈ రెండు చోట్ల జరిగిన చోరీల్లో సరైన క్లూ ఒక్కటీ దొరక్కపోగా, రోజుకో కొత్త ట్విస్ట్ ఎదురవుతుండడం పోలీసులకు సవాల్గా మారింది. దీంతో చోరీలకు పాల్పడింది స్థానికులా? ఇతర రాష్ర్టాలకు చెందిన వారా? ఎంత మంది? అనే వివరాలను సేకరించే పనిలో పడ్డారు.
గీసుగొండ మండలం గంగదేవిపల్లి గ్రామం వద్ద వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారి పక్కన ఉన్న ఇంట్లో గత జనవరి 7న పట్టపగలు చోరీ జరిగింది. మోటరు సైకిల్పై వచ్చిన యువకుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు మేడిగ నర్సమ్మను ఇనుప రాడ్డుతో తలపై కొట్టి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లాడు. తీవ్రం గా గాయపడిన బాధితురాలు వైద్య సహాయం పొందిం ది. జనం ఇది మరిచిపోకముందే ఫిబ్రవరి 23న రాత్రి జిల్లాలో వివిధ చోట్ల దొంగలు బీభత్సం సృష్టించారు. వరంగల్ సుందరయ్యనగర్లో ఇంట్లో ఒంటరిగా ఉన్న జాగిలపు ఐలమ్మ(70)ను హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను అపహరించారు. నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో డోలి సరోజన ఇంట్లో చొరబడి సుమారు రూ.3.50 లక్షలకుపైగా విలువైన బంగారు నగలు, రూ.15 వేల నగదు దోచుకెళ్లారు.
ఇదే గ్రామంలో ఎండీ ఫిరోజ్, రాజులపాటి నగేశ్ ఇళ్లల్లో చోరీకి యత్నించారు. దుగ్గొండి మండలం చలపర్తి గ్రా మ శివారులోని నల్ల కమలాకర్రెడ్డి ఇంట్లోనూ దొంగతనానికి ప్రయత్నించారు. చివరగా చలపర్తి గ్రామ శివారులో ప్రశాంత్ ఇంటి ఎదుట ఉన్న ఒక మోటర్ సైకిల్ను దొంగిలించారు. గత ఆదివారం రాత్రి కరీమాబాద్ లక్ష్మీనగర్లోని అనిల్ ఇంట్లో దొంగతనం జరిగింది. అనిల్ తన కుటుంబంతో ఊరెళ్లగా ఇంటి తాళం పగులగొట్టి బీరువలో ఉన్న రూ.38 వేలు అపహరించారు. తాజాగా గురువారం రాత్రి ఖిలావరంగల్ తూ ర్పుకోటలోని పెద్దమ్మ ఆలయంలో దొంగతనం జరిగిం ది. తాళాలు పగులగొట్టి ఆలయంలోని రెండు హుండీ ల్లో ఉన్న నగదుతో పాటు అమ్మవారి నలబై తులాల వెండి ఆభరణాలను దొంగిలించారు. స్థానికులు మిల్స్కాలని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, శనివారం వరంగల్ రైల్వేస్టేషన్ ఆవరణలోని ఏటీఎంను ధ్వంసం చేసి డబ్బులు ఎత్తుకెళ్లేందుకు బీహార్కు చెందిన అజిత్దాస్ ప్రయత్నించడం సంచలనం రేపింది.
వేగంగా విచారణ..
విశ్వసనీయ సమాచారం ప్రకారం వరుస చోరీలపై పోలీసులు అనేక కోణాల్లో విచారణ జరుపుతున్నారు. గంగదేవిపల్లి, సుందరయ్యనగర్ ఘటనలపై ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. గంగదేవిపల్లి కేసు లో ఇప్పటికీ పురోగతి లేదని తెలిసింది. ఈ ఘటనకు పాల్పడిందెవరనేది ఇంకా తేలలేదు. ఈ కేసు దర్యాప్తు లో భాగంగా చైన్స్నాచర్లను విచారించినట్లు తెలిసింది. సుందరయ్యనగర్ ఘటనలో మాత్రం క్లూ లభించింది. లక్నేపల్లి, చలపర్తి ఘటనలపై పోలీసులను పలు ప్రశ్న లు వెంటాడుతున్నట్లు సమాచారం. దీంతో ఇక్కడ చో రీకి పాల్పడిన నిందితుల విషయంలో నిర్ధారణకు రాలేకపోతున్నట్లు తెలిసింది. లక్నేపల్లి గ్రామంలో ఎండీ ఫిరోజ్ ఇంట్లోకి ఓ వ్యక్తి ప్రవేశించగా కుటుంబ సభ్యు లు అప్రమత్తం కావడంతో పారిపోయినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఆ తర్వాత సరోజన ఇంట్లోకి ముగ్గురు వ్యక్తులు చొరబడి కర్రలతో బెదిరించి, నగలు, నగదు దోచుకెళ్లినట్లు బాధితుల ద్వారా పోలీసులకు తెలిసింది. దుండగులు సరోజన ఇంట్లో పిల్లలు ఉన్న గది తలుపు గడియ పెట్టడంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఇళ్ల తలుపులకు కూడా గడియ పెట్టినట్లు పోలీసులు గుర్తించా రు.
అలాగే, చలపర్తి గ్రామ శివారులోని నల్ల కమలాకర్రెడ్డి ఇంటి వద్ద ఓ వ్యక్తి గేటు దూకి ఆవరణలోకి ప్రవేశించగా, శబ్దంతో నిద్ర లేచిన కమలాకర్రెడ్డి అప్రమ త్తం కావడంతో సదరు వ్యక్తి బయటకు పరుగెత్తాడు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు పారిపోతున్నట్లు కమలాకర్రెడ్డి గుర్తించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. చివరగా చలపర్తి గ్రామ శివారులో ప్రశాంత్ ఇంటి ఎదు ట ఉన్న రెండు మోటరు సైకిళ్లను కొద్దిదూరం తీసుకెళ్లిన దుండగులు వీటిలో ఒక బైక్ను వదిలేసి మరో బైక్ ను ఆటోలో వేసుకుని వెళ్లినట్లు తెలిసింది. లక్నేపల్లి, చలపర్తి ఘటనలపై పోలీసులు స్పష్టతకు రాలేకపోతున్నట్లు సమాచారం. లక్నేపల్లిలో ఫిరోజ్ ఇంట్లో ఒకరే కనపడడం, సరోజన ఇంట్లోకి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించడం, ముఖాలకు ముసుగులు ధరించిన వీరు కేవ లం సైగలు మాత్రమే చేసుకోవడం వంటి అంశాలపై పోలీసుల దృష్టి సారించినట్లు తెలుస్తొంది. ఈ ఘటనలకు పాల్పడిన దొంగలు స్థానికులా? ఇతర రాష్ర్టాలకు చెందిన వారా? ఎంత మంది? అనేది పోలీసులు నిర్దరణకు రాలేకపోతున్నట్లు సమాచారం. క్లూల కోసం పో లీసులు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు పని చేయకపోవడం కూడా దొంగలకు కలిసి వస్తున్నట్లు సమాచారం.