వరంగల్, జనవరి 9 : కాలనీల్లో కనీస వసతులు కల్పించి, సమస్యలను పరిష్కరించాలని బల్దియా అధికారులను స్థానికులు కోరారు. సోమవారం గ్రేటర్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన గ్రీవెన్స్లో బాధితుల నుంచి అదనపు కమిషనర్ రవీందర్ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. టౌన్ ప్లానింగ్ విభాగంపైనే ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. ఎల్బీ నగర్లోని ధోబీ ఘాట్ అన్యాక్రాంతం అవుతోందని, దాన్ని పరిరక్షించాలని గిర్మాజీపేట రజక సంఘం సభ్యులు గ్రీవెన్స్లో వినతిపత్రం అందజేశారు.
15వ డివిజన్ పరిధిలోని మొగిలిచర్ల గ్రామం శివాలయం వద్ద ఉన్న చేతిపంపు నుంచి మురికినీరు వస్తోందని, దానికి మరమ్మతు చేయాలని గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. 41వ డివిజన్ నాగేంద్రనగర్లోని కట్టెల మిల్లు వల్ల ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. 3వ డివిజన్లోని కన్నమూల గణపతికాలనీలో 3 వేల గజాల స్థలం పార్కు కోసం కేటాయించామని దానిని ఓపెన్ జీమ్గా అభివృద్ధి చేయాలని కాలనీవాసులు కోరారు. 5వ డివిజన్ సుందరయ్యనగర్ నుంచి డబ్బాల జంక్షన్ వరకు మంజూరైన డ్రైనేజీ పనులను వెంటనే ప్రారంభించాలని స్థానికులు వినతి పత్రం అందజేశారు. వనవిజ్ఞాన కేంద్రంలోకి వస్తున్న పలు కాలనీల మురుగునీటిని మళ్లించాలని పౌరస్పందన వేదిక నాయకులు గ్రీవెన్స్లో వినతి పత్రం అందజేశారు.
బల్దియా గ్రీవెన్స్లో మొత్తంగా 64 వినతులు రాగా, టౌన్ప్లానింగ్ విభాగానికి 33, ఇంజినీరింగ్ విభాగానికి 15, ప్రజారోగ్యం, శానిటేషన్కు 4, పన్నుల విభాగానికి 6, తాగునీటి సరఫరాకు 5, ఉద్యానవన విభాగానికి ఒకటి వచ్చాయి. కార్యక్రమంలో ఎస్ఈలు కృష్ణారావు, ప్రవీణ్చంద్ర, సీఎంహెచ్వో డాక్టర్ జ్ఞానేశ్వర్, సీహెచ్వో శ్రీనివాసరావు, ఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, డిప్యూటీ కమిషనర్లు అనీసుర్ రషీద్, జోనా, శ్రీనివాస్రెడ్డి, బయాలజిస్ట్ మాధవరెడ్డి, డీఎఫ్వో శంకర్లింగం, వింగ్ అధికారులు పాల్గొన్నారు.