జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భూపాలపల్లి ఏరియాలో ఏర్పాటు చేసిన సభను స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికల సభగా మార్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార సభకు జిల్లాలోని ప్రజలను తరలించారు. సీఎం సభకు మహిళలు ఇందిరమ్మ చీరెలు ధరించి రావాలని, లేకుంటే రూ. 2 వేలు ఫైన్ వేస్తామని హెచ్చరించడంతో దిక్కులేక వారు అవే చీరెలు ధరించి సభకు హాజరయ్యారు.
సభ పూర్తయ్యే వరకు ఉండాలని, మా వాళ్లు పరిశీలిస్తుంటారని కాంగ్రెస్ నేతలు చెప్పడంపై మహిళలు మండిపడుతున్నారు. భూపాలపల్లి పట్టణంలోని సుభాశ్ కాలనీ, క్రిష్ణకాలనీ తదితర కాలనీల కు పట్టాలు ఇవ్వాలని, ఇందుకు సీఎం సహకరించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరడంపై ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. భూపాలపల్లి అభివృద్ధికి రూ. 350 కోట్లు తెచ్చామని ఒకసారి, రూ.63 కోట్లు తెచ్చామని మరోసారి, ఇప్పు డు రూ. 92 కోట్లు అంటూ పొంతన లేకుండా చెప్పడంతో ప్రజలు అయోమయానికి గురయ్యారు.
ఎన్టీఆర్ భూపాలపల్లిలో సింగరేణి గనుల ఏర్పాటుకు బీజం వేశారని, కాంగ్రెస్ అభివృద్ధి చేసిందని సీఎం నోట ప్రసంగం రావడం చర్చనీయంగా మారింది. పదేళ్లుగా అధికారంలో లేనివారు ఎలా అభివృద్ధి చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే సభకు హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్బాబు, ఎంపీ కడియం కావ్యకు మాట్లాడే అవకాశం ఇచ్చి మంత్రి కొండా సురేఖకు ఇవ్వకపోవడంపై సభలో ప్రధానంగా చర్చ జరిగింది.