ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్య అందుతోందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాయపర్తి మండలంలోని కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. పెర్కవేడులో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో మొదటి విడుత 223 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి, రూ.105 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలో 10వేల మంది మహిళా సంఘాల సభ్యులకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇప్పించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. కాకతీయ మెగాటెక్స్టైల్ పార్కులో వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని ఆయన చెప్పారు.
రాయపర్తి (వర్ధన్నపేట), మార్చి 27 : ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాయపర్తి మండలంలోని కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం పెర్కవేడు గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పెర్కవేడు, రాయపర్తి, తిర్మలాయపల్లి గ్రామాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులకు ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆలోచనతోనే మన ఊరు- మన బడి కార్యక్రమం ద్వారా కోట్లాది రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న 645 ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి విడుత 223 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసినట్లు వివరించారు. అభివృద్ధి పనులు, విద్యార్థుల అవసరాలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.105 కోట్ల మేరకు ఖర్చు చేసినట్లు తెలిపారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాఠశాల పిల్లలతో గంటపాటు మమేకమయ్యారు. తరగతి గదిలో పిల్లలతో కలిసి కూర్చొని పాఠశాల విషయాలను పిల్లలతో మాట్లాడారు. మీ పాఠశాలను ఎవరు అభివృద్ధి చేశారని పిల్లలను అడగడంతో వారు కేసీఆర్ అంటూ బిగ్గరగా చెప్పారు. అలాగే, పాఠశాలలో ఉపాధ్యాయుల బోధన, వసతులపై కూడా ఆయన మాట్లాడారు. విద్యార్థులు తయారు చేసిన పలు సైన్స్ ఎగ్జిబిట్లను ఆయన పరిశీలించి అభినందించారు. అనంతరం మైదానంలో పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడి ఉత్సాహపరిచారు. గతంలో పాఠశాల ఎట్లుండే.. కేసీఆర్ సార్ సీఎం అయిన తర్వాత ఎట్లున్నదని పిల్లలను అడిగారు. దీనికి పిల్లలు సంతోషంగా మా బడి చాలా బాగుందని మంత్రికి తెలిపారు. అలాగే. పిల్లలతో మంత్రి జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.
పాలకుర్తి నియోజకవర్గంలో 10వేల మంది మహిళా సంఘాల సభ్యులకు ఉచితంగా కుట్టుశిక్షణ ఇప్పించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు మంత్రి దయాకర్రావు తెలిపారు. రాయపర్తిలో మొదటి విడుత కుట్టు శిక్షణ పొందిన 150 మంది మహిళలకు మంత్రి దయాకర్రావు, అధికారులు సెర్ప్ ఆధ్వర్యంలో ఉచితంగా కుట్టుమిషన్లను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గాన్ని మొదటి దశలో ఎంపిక చేసి 200 మంది మహిళల్లో 150 మందికి నెల రోజుల శిక్షణ పూర్తి చేసినట్లు వెల్లడించారు. మరో 50 మందికి శిక్షణ పూర్తికాగానే మిషన్లను అందజేస్తామని తెలిపారు. జూలైలో ప్రారంభం కానున్న మెగాటెక్స్టైల్ పార్కులోని కోటెక్ పరిశ్రమకు అనుసంధానం చేసి మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే, రెండు, మూడో దశల్లో వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన మహిళలకు కూడా అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.
సీఎం కేసీఆర్ పాలనలోనే గ్రామాలు ఎంతగానో అభివృద్ధి సాధించాయని మంత్రి దయాకర్రావు అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ అశ్వనీ తానాజీ వాకడే, డీఈవో వాసంతి, డీఆర్డీవో సంపత్రావు, డీపీవో కల్పన, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, ఎంఈవో రంగయ్య పాల్గొన్నారు.