ఖిలావరంగల్, మార్చి 12: చారిత్రక నేపథ్యం కలిగిన ఓరుగల్లు కోట మసక బారుతున్నది. ముష్కరుల దండయాత్రల తర్వాత మిగిలిన చారిత్రక ఆనవాళ్లు నాటి కాకతీయ చక్రవర్తుల వైభవాన్ని.. ఘన కీర్తిని చాటి చెబుతుంటే.. వాటిని పరిరక్షించి భావితరాలకు అందించాలనే తపన, ఆరాటం ఆయా శాఖలకు కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా వెయ్యేళ్ల చరిత్ర కలిగిన కాకతీయుల కోట క్రమక్రమంగా కాలగర్భంలో కలిసి పోతున్నది. కోటలోని రక్షిత కట్టడాలను కాపాడేందుకు సుమారు 40 మంది పైచిలుకు పర్మనెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగులు కేంద్ర పురావస్తు శాఖలో పని చేస్తున్నారు.
అందులో కొంతమంది విధులపై అలసత్వం ప్రదర్శించడం వల్ల చారిత్రక ప్రాశస్త్యం దెబ్బతింటున్నదని పర్యాటకులు, చరిత్రకారులు ఆరోపించారు. రాతికోటను పరిరక్షించేందుకు ఆ శాఖ ముళ్లపొదలు, పిచ్చి మొక్కలను తొలగించే పనికి శ్రీకారం చుట్టింది. ఆ పని మంచిదే అయినా.. పర్యవేక్షణ లేకపోవడం వల్ల అసలు సమస్య తలెత్తున్నదని స్థానికులు ఆరోపించారు. తొలగించిన ముళ్లపొదలను తీసి రాతికోట మెట్లపై వేస్తున్నారు. అవి ఎండిపోయిన తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు వాటికి నిప్పు పెడుతున్నారు.
దీంతో శతృదుర్బేద్యమైన రాతికోట మెట్లు అగ్నికి పగిలిపోతున్నాయి. అలాగే, కోట పరిసరాలు పొగతో మసకబారి కళావిహీనంగా మారిపోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులుగా తొలగించిన చెత్తకు నిప్పు పెట్టడం వల్ల వందల సంవత్సరాలపాటు చెక్కుచెదరకుండా ఉన్న కోట ధ్వంసం అవుతుండడంతో ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు, స్థానికులు కేంద్ర పురావస్తు శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర కిలో మీటర్ పైగానే రాతికోట మెట్లు అగ్నికి కాలిపోయి అందవికారంగా కనిపిస్తున్నాయని పర్యాటకులు విమర్శిస్తున్నారు.
నిత్యం మంటలకు కోట రాళ్లు దెబ్బ తింటుంటే.. కనీసం వాటిని అరికట్టే ప్రయత్నం కూడా చేయకపోవడంతో కేంద్ర పురావస్తు శాఖ తీరుపై అనేక విమర్శులు వెళ్లువెత్తుతున్నాయి. పురావస్తు శాఖ ఉన్నతాధికారుల తనిఖీలు కూడా కేవలం కీర్తి తోరణాల వరకు పరిమితం కావడం వల్లే కొంతమంది ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. కోటకున్న రాళ్లు ధ్వంసమయినా లేదా కళ తప్పిన వాటిని మరమ్మతు కోసం భారీగా నిధులు ఖర్చు చేసిన పాత రూపం రాదని తెలిసి కూడా కోటలోని అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చారిత్రక కట్టడాల ప్రాశస్త్యాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని పర్యాటకులు, చరిత్రకారులు కోరుతున్నారు.