వరంగల్, మే 13 : ‘గ్రేటర్’ పరిధిలో మెరుగైన పౌరసేవల కోసం తీసుకొచ్చిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్ (సీజీజీ) అట్టర్ ఫ్లాప్ అయ్యింది. గతంలో జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక యాప్ ద్వారా నగర ప్రజలకు సేవలందించేవారు. సాంకేతిక సమస్యలొస్తే అప్పటికప్పుడు పరిష్కరించే వారు. రెండేళ్ల క్రితం రాష్ట్ర స్థాయిలో ఒకే విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ కేంద్రంగా సీడీఎంఏ ఆదీనంలో సీజీజీ విధానాన్ని తీసుకురావడంతో సమస్యలు పెరిగాయి. మూడు రోజులుగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో పౌరసేవలు నిలిచిపోవడంతో నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై గ్రేటర్ అధికారులు సీజీజీ ప్రతినిధులకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని చెబుతున్నారు. 10 లక్షల జనాభా కలిగిన గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో మూడు రోజులుగా బల్దియా మీ సేవలు నిలిచిపోవడంతో అన్లైన్లో పన్నులు చెల్లించే వారు తిరిగివెళ్తున్నారు.
ఆన్లైన్లో తొలగించని రిబేట్ అప్షన్..
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లిస్తే 5 శాతం రిటేట్ ఇస్తామని మున్సిపల్ శాఖ ప్రకటించింది. ఎర్లీ బర్డ్ స్కీమ్ ముగిసి వారం రోజులైనా నేటికీ అన్లైన్లో రిబేట్ అప్షన్ తొలగించకపోవడంతో సమస్య నెలకొంది. దీంతో బల్దియా మీ సేవలో ఆస్తి పన్నుల చెల్లింపును అధికారులు నిలిపివేయడంతో నిత్యం వచ్చే లక్షల ఆదాయానికి గండి పడుతోంది. పన్నుల వసూళ్లలో వేగం పెంచాలని ఓ వైపు సమీక్షల్లో కమిషనర్ అదేశాలు ఇస్తున్నారు.
మరోవైపు స్వచ్ఛందంగా పన్నులు చెల్లించేందుకు మీ సేవ కేంద్రాల వద్దకు వస్తున్న వారి వద్ద నుంచి తీసుకోవడం లేదు. మరోవైపు మున్సిపాల్టీల్లో పౌరసేవలందించే సెంటర్ గుడ్ గవర్నెస్(సీజీజీ) సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో నగర ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పన్నుల బకాయిల నివేదికలను సైతం తప్పుల తడకగా ఇస్తున్నారని బల్దియా అధికారులే చెబుతున్నారు. వాస్తవాలకు భిన్నంగా రెట్టింపు బకాయిలున్నట్లు చూపడంతో గందరగోళం నెలకొంది.