వరంగల్, నవంబర్ 25 (నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్లోని నేతలందరం సమష్టిగా పని చేసి, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురేస్తామని బీఆర్ఎస్ తూర్పు ఎన్నికల ఇన్చార్జి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ స్పష్టం చేశారు. ఈ నెల 30న జరిగే పోలింగ్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ తూర్పు అభ్యర్థి నన్నపునేని నరేందర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేందర్ ఆధ్వర్యంలో శనివారం వరంగల్లోని ఓ గార్డెన్లో తూర్పు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, సరోగసి బోర్డు మెంబర్ హరి రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండా ప్రకాశ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గొప్పగా అభివృద్ధి చెందిందన్నారు. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నట్లు గుర్తుచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకులందరం ఒక్కతాటిపై పని చేసి వరంగల్ తూర్పులో విజయకేతనం ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే నరేందర్ కార్పొరేటర్ స్థాయి నుంచి మేయర్, ఎమ్మెల్యేగా ఎదిగి చాలా గొప్పగా పని చేశారని, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. కులమతాలకతీతంగా పని చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు. రాష్ట్రంలో ఒక పార్టీ కులాలను రెచ్చగొడుతున్నదని, మరో పార్టీ మత కల్లోలాలు సృష్టించాలని చూస్తున్నదని, వారిని నమ్మొదని కోరారు. తమ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని, నరేందర్ గెలుపునకు అందరం కలిసి పని చేస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థి నరేందర్ మాట్లాడుతూ 2014 నుంచి 2018 వర కు పరిపాలించిన నాయకురాలు వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని గాలికొదిలేసిందన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో రూ. 4100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఆంధ్రా పాలకులు మన నాయకులను పనిచేయనివ్వలేదని, మన అభివృద్ధికి సహకరించలేదని విమర్శించారు. ఐదేండ్లు అవకాశం ఇస్తే ఇక్కడ పని చేయకుండా పారిపోయినోళ్లు ప్రశాంతంగా ఉన్న తూర్పులో గూండాయిజం, రౌడీయిజం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 28న కేఎంసీ గ్రౌండ్లో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కోరారు. మేయర్ సుధారాణి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించిందన్నారు. వరంగల్ తూర్పులో నరేందర్ను గెలిపిస్తామని స్పష్టం చేశారు. ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ నన్నపునేని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తూర్పు ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే నరేందర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. మైనార్టీలపై ప్రేమతో సీఎం కేసీఆర్ ఈ నియోజకవర్గానికి అత్యధిక నిధులు కేటాయించారని గుర్తుచేశారు. ఈ అభివృద్ధి, సంక్షేమం ఇలానే కొనసాగాలంటే నరేందర్ గెలవాలని, కేసీఆర్ హ్యాట్రిక్ సాధించాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.