సుబేదారి, సెప్టెంబర్ 5: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోమవారం తెల్లవారుజామున వరంగల్ నగరానికి రావడం కలకలం రేగింది. ఇద్దరు ఎన్ఐఏ అధికారులు, స్థానిక పోలీసులతో హనుమకొండలోని ప్రకాశ్రెడ్డిపేట విద్యుత్ కాలనీలో నివసిస్తున్న చైతన్య మహిళా సంఘం నాయకురాలు, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అనిత ఇంట్లో ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సోదాలు నిర్వహించారు. రెండు సాహిత్య పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. అనిత సెల్ఫోన్ సీజ్ చేశారు. ఈ సమయంలో అనిత ఒక్కతే ఇంట్లో ఉంది.
ఇద్దరు మహిళా పోలీసుల సహకారంతో అధికారులు ఆమెను ప్రశ్నించినట్లు తెలిసింది. బయటి వ్యక్తులను ఎవరినీ కూడా ఇంట్లోకి రానివ్వలేదు. సుమారు ఐదు గంటలకుపైగా సోదాలు చేశారు. ఆతర్వాత హంటర్రోడ్డు సంతోష్నగర్లోని అనిత తల్లి నివాసానికి వెళ్లి సోదాలు చేపట్టారు. అనంతరం స్వాధీనం చేసుకున్న సాహిత్య పుస్తకాలు, సెల్ఫోన్ను ఎన్ఐఏ అధికారుల, స్థానిక రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. నేరుగా సుబేదారి పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. ఎన్ఐఏ అధికారులు, సీఐతో సమావేశమై, ఆతర్వాత హైదరాబాద్కు వెళ్లిపోయారు. ఎన్ఐఏ అధికారులు తన ఇంట్లో సోదాలు చేయడంపై అనిత మీడియాతో మాట్లాడారు. తాను చైతన్య మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉన్నానని, ఎలాంటి యాక్టివిటీస్తో సంబంధం లేదని, వృత్తిలో బిజీగా ఉన్నానని, అయినా కూడా పోలీసులు సోదాలు చేస్తూ పదే పదే అడుగుతూ ఇబ్బందులు పెట్టారని చెప్పారు.