పోచమ్మమైదాన్, మార్చి 28: మహిళల సహకారంతోనే దేశాభివృద్ధి సాధ్యమని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు నన్నపునేని వాణి ఆధ్వర్యంలో 26 డివిజన్లో నిర్వహిస్తున్న క్రీడోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిత్యం ఇంటి బాధ్యతలతో సతమతమయ్యే మహిళలకు క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. క్రీడోత్సవాల్లో మహిళలు స్నేహపూర్వక వాతావరణంలో పాల్గొన్నారని తెలిపారు. మహిళా సాధికారత దేశానికి ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బాలిన సురేశ్, డివిజన్ అధ్యక్షుడు విజయ్, రాజేంద్రాచారి, ఎలకంటి సతీశ్, క్రాంతికుమార్, శాంతి, భాస్కర్, రాజు, ఆదినారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు చార్బౌళి రోడ్డులో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసి, డివైడర్ను యథావిధిగా ఉంచాలని ఎమ్మెల్యే నరేందర్కు విజ్ఞప్తి చేశారు.
క్రీడలతో మానసికోల్లాసం
కాశీబుగ్గ: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్ అన్నారు. కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం పక్కన ఉన్న మైదానంలో ఎన్ఎన్ చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డివిజన్లోని మహిళలకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కబడ్డీ, టగ్ ఆఫ్ వార్, లెమన్ స్పూన్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బయ్యాస్వామి, ఇక్బాల్, పెండ్యాల సోనిబాబు, తోట బాలరాజు, చిమ్మని గోపి, ఎకెల్లి దేవరాజు, సింగారం దయాకర్ పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు
వరంగల్: అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దని, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. కుడా కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంగళవారం సమీక్షించారు. బల్దియా, స్మార్ట్సిటీ, పోలీస్, ఆర్అండ్బీ, విద్యుత్, కార్మిక శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో పనుల పురోగతిపై సమగ్రంగా చర్చించారు. పెండింగ్ పనులపై ఆయ న ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గడువులోగా పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యపై ఎమ్మెల్యే ట్రాఫిక్ ఏసీపీలు బోనాల కిషన్, మధుసూదన్తో ప్రత్యేకంగా చర్చించారు. డివిజన్ సమస్యలను కార్పొరేటర్ల ద్వారా తెలుసుకొని అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్లను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులను సూచించారు.
శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణానికి హాజరు కావాలని కోరుతూ ఎమ్మెల్యే నన్నపునేనిని రంగశాయిపేటలోని సీతారామచంద్రస్వామి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పెరుకవాడలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వరంగా కలిశారు. ఈ మేరకు ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో ఖిలావరంగల్ పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్, కార్పొరేటర్ పోశాల పద్మ, ఉత్సవ కమిటీ చైర్మన్ కృష్ణ, ఆలయ ధర్మకర్తలు ప్రభాకర్, అనిల్, కవిత పాల్గొన్నారు. అలాగే, మండిబజార్లోని శివ సంజీవ ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహించనున్న సీతారాముల కల్యాణానికి రావాలని కోరుతూ ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా నన్నపునేని ఆలయ అభివృద్ధికి రూ. 50 వేలు అందించారు.