పరకాల, మే 22 : జట్కా బండి అంటేనే ఆర్థిక స్థోమతకు చిహ్నం. గుర్రపు బండిపై ప్రయాణం అంటే ప్రతి ప్రయాణికుడు ఆసక్తిగా, ఆనందంగా ఎదురు చూస్తాడు. ఒకప్పుడు ఊరికి వెళ్లాలన్నా, సరుకులను త్వరగా చేరవేయాలన్నా జట్కాబండ్లనే వినియోగించేవారు. అలా పాత తాలుకా కేంద్రమైన పరకాల వ్యాప్తంగా వందలాది కుటుంబాలకు బతుకుదెరువునిచ్చేవి. కాలక్రమంలో ఆధునిక రవాణా వ్యవస్థతో పోటీపడలేక గుర్రపు బండ్లు కనుమరుగైపోయాయి. కానీ ఒకే ఒక వ్యక్తి మాత్రం 35 ఏళ్లుగా కాలంతో పోటీపడుతూ బతుకుబండిని లాగుతున్నాడు. అతడే నడికూడ మండలం నర్సక్కపల్లికి చెందిన ఆవుల మొండయ్య.
నాడు వందకు పైగా గుర్రపు బండ్లు
రవాణా వ్యవస్థ మెరుగ్గా లేని ఆ కాలంలో ఉమ్మడి పరకాల వ్యాప్తంగా వందకు పైగా గుర్రపు బండ్లు ఉండేవి. ఆ సమయంలో ఎవరైనా ప్రయాణం చేయాలనుకున్నా, సరుకులు ఇతర ప్రాంతాలకు చేరవేయాలన్నా ఎడ్లబండ్లతో పాటు గుర్రపు బండ్లు ఉండేవి. ఎడ్లబండ్లలో ప్రయాణానికి ఎక్కువ సమయం పట్టేది. అందుకే చాలామంది గుర్రపు బండ్లను ఆశ్రయించేవారు. దీంతో పరకాల ప్రాంతంలో గుర్రపు బండ్లకు డిమాండ్ ఉండేది. అలా పరకాల వ్యాప్తంగా నర్సక్కపల్లి, నడికూడ, చౌటుపర్తి, రాయపర్తి, పులిగిల్ల, నాగారం, కంఠాత్మకూర్, కౌకొండ గ్రామాల్లో వందకు పైగా గుర్రపు బండ్లు ఉండేవి. ఈ గుర్రపు బండ్లపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు ఉపాధి పొందేవి.
ఆధునికతతో పోటీపడలేక..
30నుంచి 40ఏండ్ల క్రితం వరకు గ్రామాల్లో రవాణా వ్యవస్థకు ఎడ్లబండ్లు, గుర్రపు బండ్లపై ఆధారపడేవారు. త్వరగా తమ ప్రయాణాన్ని ముగించే క్రమంలో భాగంగా ఎక్కువమంది గుర్రపు బండ్లను ఆశ్రయించేవారు. దీంతో మండలవ్యాప్తంగా చాలామంది కుటుంబాలు గుర్రపు బండ్లతో ఉపాధి పొందేవారు. కాలక్రమేనా ఆధునికత పెరుగడంతో రవాణా వ్యవస్థ మెరుగైంది. ఈ క్రమంలో ఆటోలు, ద్విచక్రవాహనాలు పెరగడంతో ప్రజలకు రవాణా వ్యవస్థ సులువు కాగా గుర్రపు బండ్ల వినియోగం తగ్గింది. దీంతో చాలా మంది గుర్రపు బండ్లను అమ్ముకున్నారు. రానురాను రవాణా వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో జట్కాబండ్లు కనుమరుగయ్యాయి. కానీ నర్సక్కపల్లికి గ్రామానికి చెందిన వారెవరైనా పట్టణానికి చిన్న మొత్తంలో సరుకులు రవాణా చేయాలన్నా.. పట్టణం నుంచి ఏవైనా సరుకులు తీసుకురావాలన్నా మొండయ్యనే పిలుస్తారు. ఇలా పరకాల ప్రాంతంలో జట్కాబండి నడుపుతూ ఉపాధి పొందుతున్న ఒకే ఒక్కడిగా మొండయ్య నిలుస్తున్నాడు.
అభిమానంతో అమ్ముకోలేకపోతున్నా..
గత 35ఏండ్లుగా గుర్రపు బండి నడుపుతూ ఉపాధి పొందుతున్నా. ఇప్పటివరకు మూడు గుర్రాలను మార్చాను. గత 14సంవత్సరాల క్రితం ఐదు వేలు పెట్టి పెద్దపల్లిలోని కమాన్పూర్ నుంచి గుర్రాన్ని కొనుగోలు చేశాను. మొదట్లో ఉపాధి మంచిగానే ఉండేది. రానురాను ఆటోలు పెరుగడంతో గిరాకీ తగ్గింది. రోజు కూలీ గిట్టుబాటు కాక కొన్నిరోజుల క్రితం గుర్రాన్ని అమ్మాలనుకున్నా. కానీ అభిమానంతో అమ్మలేకపోయాను.
– ఆవుల మొండయ్య, నర్సక్కపల్లి, నడికూడ మండలం