వరంగల్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓటర్ల నమోదు ప్రక్రియ మంగళవారంతో ముగియనున్నది. చివరి రోజు కావడంతో ఎక్కువ మంది దరఖాస్తు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రాడ్యుయేట్లు స్వయంగా ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న వారు ప్రత్యేకంగా కేంద్రాలను పెట్టి ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. 2023 డిసెంబర్ 30 నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలైంది. 2023 నవంబర్ 1 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మూడేండ్లు గడిచిన వారు ఈ ఎన్నికలో ఓటు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఇప్పటివరకు 3.50 లక్షల మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. పరిశీలన అనంతరం తుది ఓటర్ల జాబితా వెల్లడించనున్నారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి 2021లో జరిగిన సాధారణ ఎన్నికలో 4,91,396 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 3,23,377 మంది పురుషులు.. 1,67,947 మంది మహిళలు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్రెడ్డి ఇటీవలి ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పల్లా రాజేశ్వర్రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటర్లు ప్రతిసారి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ ఎన్నికతో పోల్చితే ఉప ఎన్నికలో ఓటర్ల సంఖ్య ప్రస్తతానికి తక్కువగానే ఉన్నది. ప్రతిసారి నమోదు చేసుకోవడం దీనికి కారణంగా కనిపిస్తున్నది.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయే ట్స్ నియోజకవర్గ పరిధి 12 జిల్లాల్లో ఉన్నది. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములు గు, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట జిల్లాల్లోని గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా ఉంటారు. సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాల్లో కొన్ని మండలాలు ఈ సెగ్మెంట్లోకి రావు. వరంగల్ జిల్లాల నుంచి సిద్దిపేట జిల్లాలో చేరిన కొమురవెల్లి, మద్దూరు, ధూల్మిట్ట, చేర్యా ల.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో భూపాలపల్లి, చిట్యాల, టేకుమట్ల, రేగొండ, గణపురం, మొగుళ్లపల్లి, గోరుకొత్తపల్లి మండలాలు ఈ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. ములుగు మండలంలో వెంకటాపూర్(నూగూరు), వాజేడు.. మహబూబాబాద్ జిల్లాలో గార్ల, బయ్యారం మండలాలు.. హనుమకొండ జిల్లాలో ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్ మండలాలు ఎన్నిక జరిగే నియోజకవర్గ పరిధిలో ఉండవు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో ప్రతిసారి బీఆర్ఎస్(టీఆర్ఎస్) పార్టీ అభ్యర్థి గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనమండలి ఏర్పాటు చేసేందుకు 2007లో మొదటిసారి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. టీఆర్ఎస్ అభ్యర్థి కపిలవాయి దిలీప్కుమార్ ఈ ఎన్నికలో విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి 2009లో జరిగిన ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ కపిలవాయి దిలీప్కుమార్ రెండోసారి గెలిచారు. 2015, 2021లో ఈ నియోజకవర్గానికి జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం సాధించారు.