పోచమ్మమైదాన్, మే 18 : బీఆర్ఎస్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, పేదల సమస్యలను పరిష్కరించడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. దేశాయిపేటలోని సీకేఎం కాలేజీ మైదానంలో 12, 22, 23 డివిజన్ల ఆత్మీయ సమ్మేళనం గురువారం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారధ్యంలో ప్రజా సేవకు అంకితమయ్యానని తెలిపారు. తాను గజం జాగ కూడా కబ్జా చేయలేదని, కొంతమంది చిల్లరమల్లర మాటలు చెబుతున్నారని, నమ్మవద్దని కోరారు.
తూర్పు నియోజకవర్గంలో రూ.3,800 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తూర్పులో 80శాతం పేద ప్రజలున్నారని, సీఎం కేసీఆర్ ప్రతి ఇంటికీ ఏదో రకంగా లబ్ధి చేస్తున్నారని వివరించారు. తూర్పు గడ్డ బీఆర్ఎస్ అడ్డా అని తెలిపారు. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించాలని, జూన్ 2 నుంచి జరిగే దశాబ్ది ఉత్సవాల ప్రణాళిక సిద్ధమైందని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్ కృషితో తెలంగాణకు కంపెనీలు వస్తున్నాయని, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కావటి కవిత, 22వ డివిజన్ ఇన్చార్జి మావురపు విజయభాస్కర్రెడ్డి, 23వ డివిజన్ మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి పాల్గొన్నారు.
కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం..
రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతున్నది. ఈ సారి 105 సీట్లు గెలిపించి మళ్లీ తెలంగాణ ప్రభుత్వాన్ని స్థాపించుకోవాలి. దేశంలో అన్ని రాష్ర్టాలు కేసీఆర్ పాలనను అనుకరిస్తున్నాయి. ప్రధాని మోదీ కూడా ఇక్కడి పథకాలను కాపీ చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వల్ల రాష్ర్టానికి ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. నియోజకవర్గంలో రింగ్ రోడ్లు నిర్మిస్తున్నారు. బీజేపీ నాయకులు బోగస్ ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారు. కేసీఆర్ను ఉద్దేశపూర్వకంగా విమర్శించడం తప్ప మరేమీ వీరికి చేతకాదు. మొన్ననే కర్నాటకలో ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపారు. దేశవ్యాప్తంగా కేసీఆర్ పేరు మారుమోగుతున్నది. సోషల్ మీడియా వేదికగా కుతంత్రాలు చేసేవారిని తిప్పి కొట్టాలి.
– బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ
అభివృద్ధిలో తెలంగాణ నంబర్ వన్..
కేసీఆర్ ఆశీర్వాదంతో తూర్పు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే నన్నపునేని అభివృద్ధి చేశారు. తెలంగాణ రాక ముందు కరంటు కష్టాలు, నల్లాల దగ్గర బిందెల లొల్లి ఉండేవని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి కళ్లకు కట్టనట్లు కనబడుతున్నది. అభివృద్ధిలో తెలంగాణ దేశంలో నంబర్వన్గా నిలిచింది. మహారాష్ట్రలో కూడా కేసీఆర్ పథకాలు కావాలని కోరుతూ, బీఆర్ఎస్ పార్టీలో అక్కడ నాయకులు చేరుతున్నారు.
– పసునూరి దయాకర్, వరంగల్ ఎంపీ
జీవనోపాధి దొరికింది..
దళిత బంధు వల్ల నాకు జీవనోపాధి దొరికింది. గతంలో ఏ పని లేకపోవడం వల్ల ఖాళీగా ఉన్నా. సీఎం కేసీఆర్ పుణ్యం వల్ల ఏడాది క్రితం రూ.10 లక్షల దళితబంధు వచ్చింది. ఈ డబ్బులతో ఎల్బీ నగర్లో ఓ షట్టర్ అద్దెకు తీసుకుని టెంట్హౌస్ నడిపిస్తున్నా. పెళ్లిళ్లు, పేరంటాలు, ఇతర శుభకార్యాలు జరిగినప్పుడు టెంట్ హౌస్ సామాన్లు అద్దెకు ఇస్తున్న. సొంతంగా పనిచేసుకుంటూ నెలకు రూ.30వేలు సంపాదిస్తున్నా. ఇప్పుడు భార్యాబిడ్డలతో సంతోషంగా జీవిస్తున్నా.
– జూపాక సురేశ్, దళితబంధు లబ్ధిదారుడు, పోచమ్మమైదాన్
నేత పింఛన్ ఆదుకుంటోంది..
సర్కార్ కడుపు సల్లగుండా.. నేత కార్మికులకు పింఛన్ ఇవ్వడం వల్ల మా కుటుంబానికి ఎంతో తోడ్పాటైంది. ఆనాడు రూ.200 ఉన్న పింఛన్ ఇప్పుడు రూ.2001 చేయడంతో ఆర్థికంగా కలిసివస్తోంది. 50 ఏళ్ల నుంచి నేత వృత్తిపై ఆధారపడి బతుకు వెళ్లదీస్తున్న నేను చేనేత పింఛన్ తీసుకుంటూ భార్యాపిల్లలతో సల్లగా ఉంటున్నాను. రేషన్ కింద ప్రతినెలా 35 కిలోల బియ్యం ఇవ్వడం వల్ల కడుపు నిండా భోజనం దొరుకుతోంది. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఆనందంగా ఉన్నాం.
– కల్లెపల్లి రాజ సమ్మయ్య, నేత కార్మికుడు, కొత్తవాడ