హనుమకొండ సిటీ, అక్టోబర్ 6 : సర్కారు బడుల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, పౌష్టికాహారానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులుఆకర్షితులవుతూ సర్కారు బడులల్లో చేరేందుకు క్యూ కడుతున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పౌష్టికాహార లోపా న్ని నిర్మూలించడానికి ప్రభుత్వం కొత్తగా శ్రీకారం చుట్టిన సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీంను శుక్రవారం హనుమకొండ లష్కర్బజార్లోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రైమరీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో గిరిజన, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మంత్రి దయాకర్రావులు కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని నిరుపేద విద్యార్థులకు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్య అందించేందుకు గత సంవత్సరం రూ.10వేల కోట్లతో పాఠశాలలను ఆధునీకరించారన్నారు. పుస్తకాలు, యూనిఫామ్స్, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందజేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు సంఖ్య సైతం పెరిగిందన్నారు. అంతేకాకుండా సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని అమలు చేసి రోజుకో తీరు టిఫిన్ అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రతి పేద విద్యార్థి కూలీనాలికి పోకుండా సర్కారుబడికి పోయి చదువుకుంటున్నది ఒక్క తెలంగాణలోనే అని చెప్పారు. మండలాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు, నియోజకవర్గాల్లో డిగ్రీ కళాశాలలు స్థాపించి ఒక్కో విద్యార్థ్ధిపై లక్ష 25 వేల రూపాయలను ప్రతి యేడా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
గిరిజన, శిక్ష సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 20లక్షల పైగా ఉన్న విద్యార్థులకు అల్పాహారం కోసం ప్రభుత్వం ఏటా రూ.400 కోట్లు ఖ ర్చు పెట్టనుందన్నారు. సె మిరెసిడెన్షియల్ తరహాలో కూలీనాలీ చేసుకొనే తల్లిదండ్రులకు ఎలాంటి ఆందోళన లేకుండా ఉదయం బ్రేక్ఫాస్ట్ను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. తద్వారా విద్యార్థులు చదవుపై శ్రద్ధపెట్టి, ఆరోగ్యవంతంగా తయారవుతారన్నారు.
ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని రెండు ప్రాథమిక హక్కులైన విద్య, వైద్యంను గత ప్రభుత్వాలు నిర్వీర్వం చేస్తే సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి ఈ రెండు రంగాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా మౌలిక వసతుల కల్పించి, ఇప్పుడు అల్పాహారానికి శ్రీకారం చుట్టడంతో పిల్లలు వారి తల్లిదండ్రులు సంతోషపడుతున్నారన్నారు. పిల్లల ఆరోగ్యానికి అల్పాహార పథకం దోహదపడనుంద న్నారు.
దేశ ప్రజలంతా కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో మూడోసారి కేసీఆర్ సీఎంగా బాధ్యతలు
స్వీకరించండంతోపాటు కేంద్రంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించబోతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్కుమార్, జిల్లా కలేక్టర్ సిక్తా పట్నాయక్, పాఠశాల ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి, మండల విద్యాశాఖధికారి రాంకిషన్రాజు, సెక్టోరియల్ అధికారులు రాధా, సునిత, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.