హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 2 : విద్యార్థులు, యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని ఉద్యోగావకాశాలు పొందాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేలాది మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వివిధ కంపెనీలు ఈ మెగా జాబ్ మేళాను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. హైదరాబాద్, వరంగల్ తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 65కు పైగా కంపెనీలు ఉద్యోగావకాశాలను కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నాయని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాబ్ మేళాలో వేలాది మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా అభ్యర్థులకు వివిధ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసి ఆఫర్ లెటర్స్ అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాధికాగుప్తా, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, యూత్ సర్వీసెస్ అధికారి జగన్నాథం పాల్గొన్నారు.
పశ్చిమ నియోజకవర్గంలోని డివిజన్ల అభివృద్ధే ఏకైక లక్ష్యమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ నగరంలోని 9, 10వ డివిజన్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైస్రాయ్ బార్ నుంచి ఐకే ఫంక్షన్హాల్ ఏరియాలో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైన్ నిర్మాణానికి, రూ.30 లక్షలతో లక్ష్మీపురంలో సీసీ రోడ్డు, రూ.14 లక్షలతో సైడ్ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, చీకటి శారద-ఆనంద్, వేముల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ నసీం జహాన్, డివిజన్ అధ్యక్షులు కుమార్ యాదవ్, మహ్మద్ జాఫర్, బంక సరళ, చీకటి ఆనంద్ పాల్గొన్నారు.