నమస్తేతెలంగాణ నెట్వర్క్, ఫిబ్రవరి 22 : మినీ మేడారాలు జనసంద్రంగా మారాయి. వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని మినీ జాతరలకు భక్తులు పోటెత్తారు. గురువారం అగ్రంపహాడ్లోని గోనెల సారంగపాణి ఇంట్లో పూజారులు గోనెల వెంకన్న, గోనెల రవీందర్, గుల్లపల్లి సాంబశివరావు, సహాయ పూజారులు ఉడుతనబోయిన గోవర్ధన్, రేగుల సునీత, సిరిపూరి శారద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సమ్మక్క తల్లిని ప్రధాన పూజారి గోనెల సారంగపాణి డప్పు చప్పుళ్లు, వాయిద్యాలు, శివసత్తుల పూనకాల నడుమ గద్దెకి చేర్చారు. కాగా, జాతరలో ప్రధాన ఘట్టాన్ని తిలకించేందుకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, డీసీపీ రవీందర్, ఆర్డీవో శ్రీనివాస్, ఏసీపీ కిశోర్కుమార్, తహసీల్దార్ జగన్మోహన్రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, సీఐలు సంతోష్, రవిరాజు, ఎండోమెంట్ అధికారి శేషగిరి, జాతర చైర్మన్ శీలం రమేశ్ పాల్గొన్నారు.
కాగా, ఈ సారి జాతరలో పోలీసులు 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అయితే, అగ్రంపహాడ్ జాతరకు వెళ్లే ఎనుమాముల నుంచి రెడ్డిపాలెం మీదుగా అక్కంపేట దారిలో చిమ్మచీకట్లు అలుముకున్నాయి. రహదారి వెంట లైట్లు, సైన్బోర్డులు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.
ఎల్కతుర్తి మండలంలోని దామెర జాతరలో పూజారి మద్దె భూమయ్య ఆధ్వర్యంలో మద్దె కొండయ్య, భీమదేవరపల్లి మండలంలోని ములుకనూరు, కొత్తకొండ జాతరల్లో కోయ పూజారులు సమ్మక్క తల్లిని డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాల నడుమ గద్దెపైకి తీసుకొచ్చారు. కాగా, మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవార్లను దర్శించుకున్నారు.
నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయ్కుమార్, జాతర కమిటీ చైర్మర్లు మాడుగుల వీరస్వామి, ఊదరి రవీందర్, ఠాకూర్ రాంసింగ్, కొత్తకొండ ఆలయ ఈవో కిషన్రావు, మాజీ సర్పంచ్ రవీందర్రెడ్డి, వైస్ చైర్మన్ చల్లా దయాకర్రెడ్డి పాల్గొన్నారు. నల్లబెల్లి మండలం మద్ది మేడారం, టేకుల మేడారం జాతరలకు భక్తులు పోటెత్తారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
జాతరల్లో ఏసీపీ కిరణ్కుమార్, సీఐ శ్రీనివాస్, ఎస్సై నగేశ్ నేతృత్వంలో బందోబస్తు చేపట్టారు. తహసీల్దార్ రాజేశ్, ఎంపీవో కూచన ప్రకాశ్, వైద్యాధికారి శశికుమార్, ఎండోమెంట్ మహబూబాబాద్ జిల్లా అధికారి నందనం కవిత, భిక్షమాచారి, ఆలయ కమిటీ చైర్మన్ గాదె సుదర్శన్, పూజారులు దురిశెట్టి సమ్మయ్య, హరికృష్ణ, ధర్మపురి సువర్ణ, కిష్టయ్య, ఇరిగేషన్ శాఖ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. నగరంలోని అమ్మవారిపేటలో గురువారం రాత్రి దామెరగుట్ట నుంచి సమ్మక్కను పోలీసుల బందోబస్తు నడుమ పూజారులు తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చొరవతో తొలిసారిగా మేడారంలో జరిపినట్లు ఇక్కడ కూడా సమ్మక్క రాక సందర్భంగా సెంట్రల్ జోన్ డీసీపీ బారి 303 వెపన్తో మూడు రౌండ్లు ఫైరింగ్ చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే, నడికూడ మండలంలోని పులిగిల్ల , కంఠాత్మకూర్ గ్రామాల్లో మినీ జాతరలు వైభవంగా జరిగాయి.