హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 30: ‘నీవ్వొక్కడివే దళితుడివి కావు.. దళిత సామాజికవర్గం పేరుతో వసూళ్లకు దిగేది మందకృష్ణ, ఆయన అనుచరులే. కేవలం రాజకీయ లబ్ధికోసమే వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్పై మందకృష్ణ ఆరోపణలు చేస్తున్నాడు’ అని పర్వతగిరి జడ్పీటీసీ సింగులాల్ మండిపడ్డారు. హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయంగా అరూరి రమేశ్ ఎదుగుదలను ఓర్వలేకనే మందకృష్ణ విమర్శలు చేస్తున్నాడని, అసలు భూముల విషయంలో అరూరికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. 2014లో వర్ధన్నపేటలో ఎమ్మెల్యేగా ఇద్దరు పోటీ చేస్తే అరూరి రమేశ్ 87 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారని, మందకృష్ణకు కనీసం డిపాజిట్ కూడా రాలేదని గుర్తుచేశారు.
అరూరి వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తూ ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, అలాంటి వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. భూదందాల విషయంలో ప్రతి పోలీస్స్టేషన్కు వెళ్లేది మందకృష్ణ, ఆయన అనుచరులు కాదా అని సింగులాల్ ప్రశ్నించారు. రెండోసారి ఎన్నికల్లో 97 వేల ఓట్లతో అరూరి దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచారని, అలాంటి వ్యక్తి భూదందాలు చేస్తే ప్రజలు ఇంత మెజార్టీ ఎందుకిస్తారని ప్రశ్నించారు. మచ్చలేని నాయకుడు అరూరిపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. లేదంటే దళితులంతా ఏకమై తిరగబడుతారని హెచ్చరించారు. అరూరి రమేశ్కు బేషరతుగా మందకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసులు నిజాయితీగా ఉండాలని, తప్పు చేయని వారిపై కొందరు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సమావేశంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీ పాల్గొన్నారు.