వరంగల్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): పత్తి కొనుగోలు కోసం ప్రభుత్వం వరంగల్ జిల్లాలో 23కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాటిని కాటన్ జిన్నింగ్ మిల్లుల్లో ఏర్పాటు చేయనుంది. నవంబర్ మొదటి వారం నుంచి ఆయా కేంద్రాల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా కొనుగోలు చేయనుంది. పత్తి దిగుబడి ఇప్పటికే ప్రారంభం, కొద్ది రోజులుగా మార్కెట్కు వస్తోంది. ప్రభుత్వం పత్తి మద్దతు ధరలను ఇటీవల ప్రకటించింది. క్వింటాల్కు పొడవు పింజ రకం రూ.7,020, మధ్య పింజ రకం రూ.6,620గా నిర్ణయించింది. తేమ శాతం 8లోపు ఉండాలని స్పష్టం చేసింది. వానకాలం పత్తి దిగుబడి వస్తుండడంతో కొద్ది రోజుల క్రితం కలెక్టర్ పీ ప్రావీణ్య మార్కెటింగ్, వ్యవసాయ, తూనికలు, కొలతలు, సీసీఐ తదితర శాఖల అధికారులు, కాటన్ జిన్నింగ్ మిల్లుల యజమానులతో సమావేశం నిర్వహించారు. జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం, రైతుల కోసం మౌలిక వసతులు కల్పించటంపై పలు సూచనలు చేశారు. సీసీఐ ద్వారా సాధ్యమైనంత త్వరలో పత్తి కొనుగోళ్లను ప్రారంభించాలని ఆదేశించారు.
మార్కెటింగ్ శాఖ జిల్లాలో 23 పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు చేసింది. వీటిలో వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో 18, నెక్కొండ, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ పరిధిలో రెండేసి, నర్సంపేట మార్కెట్ పరిధిలో ఒకటి ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. వీటిని నిర్వహించే కాటన్ జిన్నింగ్ మిల్లులను కూడా ప్రతిపాదించింది. పరిశీలించిన ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. పత్తి కొనుగోలు కేంద్రం నిర్వహించే ప్రతి జిన్నింగ్ మిల్లులో రైతుల కోసం టెంటు, కుర్చీలు, తాగునీటి వంటి మౌలిక వసతులు కల్పించాలని మార్కెటింగ్ శాఖ అధికారులు జిన్నింగ్ మిల్లుల యజమానులకు సూచించారు. మద్దతు ధర, తేమ శాతం వివరాలను తెలియజేయడానికి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని చెప్పారు.
కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించిన రైతులకు చెల్లింపుల్లో ఈసారి కొత్త విధానం అమల్లోకి రానుంది. దీనిపై అధికారులు కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బ్యాంకు ఖాతాను ఆధార్తో లింక్ చేసుకున్న రైతుల వద్ద మాత్రమే పత్తి కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. సీసీఐ నేరుగా ఏబీపీఎస్, పీఎఫ్ఎంఎస్ ద్వారా వారి ఆధార్కి లింక్ చేసిన బ్యాంకు ఖాతాలోకి నగదును జమ చేస్తుందని, రైతులు తమ ఆధార్కార్డు వెంట తెచ్చుకోకుంటే పత్తి కొనే అవకాశం ఉండదని పేర్కొంటున్నారు.
సీసీఐ ద్వారా జిల్లాలో 23 సెంటర్లలో పత్తిని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవంబర్ మొదటి వారం నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. కాటన్ జిన్నింగ్ మిల్లుల యజమానులు రైతులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఈసారి కొత్తగా అమల్లోకి వచ్చే చెల్లింపుల విధానం వల్ల రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్లను నిర్వహిస్తాం. ఆధార్తో బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకోవాలని, ఆ తర్వాత ఆధార్ కార్డును వెంట తీసుకురావాలని రైతులకు తెలియజేస్తాం. రైతులు నాణ్యతా ప్రమాణాలను పాటించి కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ మద్దతు ధర పొందాలి.
– ప్రసాదరావు,
మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి, వరంగల్