మహబూబాబాద్ రూరల్, డిసెంబర్ 18 : తనయుడితో ఆడుకుంటానని బయటకు తీసుకెళ్లిన కసాయి తండ్రి మారుతల్లితో కలిసి విషమిచ్చి హతమార్చిన ఘటన మానుకోట పట్టణంలో ఆది వారం జరిగింది. టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. మానుకోటలోని బీసీ కాలనీకి చెందిన మాలోత్ రవీందర్కు ఇద్దరు భార్యలు. 15 ఏళ్ల క్రితం ఇదే కాలనీకి చెందిన ఇందిరను వివాహం చేసుకు న్నాడు. ఆమెకు ఇద్దరు కుమారులు కలిగిన అనంతరం కుటుంబ తగాదాలతో కొంత కాలం దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే కురవి మండలం కొత్తూ రు(జీ)కి చెందిన సరితను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు కుమార్తె, కుమారుడు కలిగారు. రవీందర్, సరిత మధ్య కుటుంబ తగాదాలు జరగడంతో మొదటి భార్య ఇందిర వద్దకు వెళ్లాడు. నాలుగేళ్ల క్రితం సరిత కుమార్తె ప్రణీతను ఇందిర భర్త రవీందర్తో కలిసి చంపారని ఆరోపణలున్నాయి. దీనిపై పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ చేసి బీసీ కాలనీలోని ఇంట్లో ఇందిరను, ఇదే కాలనీలో సరితతో రవీందర్ కలిసి ఉంటున్నాడు.
ఈ నేపథ్యంలో రవీందర్ శనివారం సాయంత్రం సరిత వద్దకు వచ్చి కుమారుడైన నేహాల్(2)తో ఆడుకుంటానని చెప్పి ఇందిర ఇంటికి తీసుకెళ్లాడు. కూల్డ్రింక్లో విషం కలిపి నేహాల్తో తాగించిన అనంతరం సరిత వద్దకు తీసుకొచ్చాడు. బాలుడు వాంతులు చేసుకోవడంతో చికిత్స కోసం ఏరియా హాస్పిటల్కు తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఆదివారం మధ్యాహ్నం నేహాల్ మృతి చెందాడు. ఈ ఘటనతో సరిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. భర్త రవీందర్, మారుతల్లి ఇందిర కలిసి కూల్డ్రింక్లో విషం కలిపి ఇవ్వడంతోనే తన కుమారుడు మృతి చెందాడని, ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సరిత టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.