ఐనవోలు, డిసెంబర్ 21 : మాస్టర్ ప్లాన్ను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఐలోని మల్లన్న ఆలయాన్ని అభివృద్ధి చేద్దామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మల్లికార్జునస్వామి ఆలయంలో బుధవారం ఎమ్మెల్యే అరూరి రమేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మల్లన్న బ్రహ్మోత్సవాల జాతర సమీక్ష సమావేశానికి కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, సీపీ ఏవీ రంగనాథ్, కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి మంత్రి ఎర్రబెల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పెద్ద జాతర ఏర్పాట్ల విషయంలో ఎక్కడ తగ్గొదని అధికారులను ఆదేశించారు.
జాతరలోపు తక్షణమే జరిగే అభివృద్ధి పనులకు రూ. 2 కోట్లు మంజూరు చేయాలని కలెక్టర్కు సూచించారు. రూ.10 కోట్లతో ఐనవోలును ఆనుకొని ఉన్న గ్రామాలను అనుసంధాం చేస్తూ చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు పెండింగ్లో ఉన్నాయని, ఆ పనులను వెంటనే చేపట్టాలన్నారు. బందోబస్తు విషయంలో సీపీ పకడ్బందీ ఏర్పాట్ల చేయాలని చెప్పారు. ఐలోని మల్లన్న దేవాలయం మహిమాన్వితమైందని, తాను మంచి పని చేసే ముందు ప్రతిసారి మల్లన్నను దర్శించుకొని వెళ్తాను. టూరిజం శాఖ ఆధ్వర్యంలో హరితహోటల్కు ప్రతిపాదనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కుడా నుంచి నాలుగు సులభ్ క్లాంపెక్స్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. ఆలయంలో డార్మెటరీ భవనం కోసం కూడా నిధులు మంజూరు చేయాలన్నారు.
పారిశుధ్యంపై ప్రత్యేక శద్ధ చూపాలి..
మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి జాతర బ్రహ్మోత్సవాల్లో పారిశుధ్య సమస్యలు తల్తెకుండా చూడాలని ఆదేశించారు. జాతరలో పారిశుధ్య సమస్యలు తలెత్తితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.జీడబ్ల్యూఎంసీ నుంచి 100 మంది సిబ్బందితో పాటు రెండు స్వీపింగ్ మిషన్ల కేటాయించాలన్నారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ జీడబ్ల్యూఎంసీ నుంచి ఏర్పాట్లు చేస్తామన్నారు.
జాతరను విజయవంతం చేస్తాం: ఎమ్మెల్యే అరూరి రమేశ్ జాతరను విజయవంతం చేస్తామని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో దాతలకు ప్రత్యేకంగా స్వామి వారి దర్శనం చేయించాలని సూచించారు.
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్
బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు సూచించారు. జాతరకు వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పించాలన్నారు. కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్ మాట్లాడుతూ ఆలయాభివృద్ధికి తమవంత సహకారం అందిస్తామని, గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు మాట్లాడుతూ ఆలయంలో శాశ్వత నిర్మాణ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్ను తీసుకురావాలని మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరిని కోరారు.
అదనపు కలెక్టకర్ సంధ్యారాణి, జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు, ఎంపీపీ మార్నేని మధుమతి, ఈవో అద్దంకి నాగేశ్వర్రావు, వైస్ ఎంపీపీ తంపుల మోహన్, జడ్పీ కోఆప్షన్ ఉస్మాన్అలీ, స్థానిక సర్పంచ్ జన్ను కుమారస్వామి, ఎంపీటీసీ కొత్తూరి కల్పన, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ సంపత్కుమార్, ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మి, డీఎంహెచ్వో సాంబశివరావు, ఆర్డీవో వాసుచంద్ర, డీపీవో జగదీశ్వర్, మామునూరు ఏసీపీ నరేశ్కుమార్, ఐబీ ఈఈ మల్లేశ్, తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీవో వెంకటరమణ, సీఐ శ్రీనివాస్, ఎస్సై భరత్ పాల్గొన్నారు.