వరంగల్, జనవరి 5: జీడబ్ల్యూఎంసీ పరిధిలో వీధిదీపాల నిర్వహణ పకడ్బందీగా, పక్కాగా జరుగాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. గ్రేటర్ కార్పొరేషన్ కార్యాలయంలో ఎలక్ట్రికల్ విభాగం, ఈఈఎస్ఎల్ అధికారులతో గురువారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గ్రేటర్ కార్పొరేషన్లో వీధిదీపాల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఈఈఎస్ఎల్ సంస్థ సమర్థవంతంగా నిర్వహణ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. విలీన గ్రామాల్లో వీధిదీపాలు ప్రతి రోజూ వెలిగేలా అధికారులు శ్రద్ధ తీసుకోవాలని కోరారు.
ఆన్, ఆఫ్ టైమర్లు, సర్వర్ డౌన్, సీపీఎంఎస్ బాక్స్ల్లో తలెత్తే సాంకేతి లోపాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. గ్రేటర్ కార్పొరేషన్లో వీధిదీపాల నిర్వహణ సక్రమంగా జరిగేలా ఎలక్ట్రికల్ ఇంజినీర్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కొత్తగా అమర్చిన వీధి దీపాల్లో పెండింగ్లో ఉన్న వాటిని వెంటనే అమర్చాలని ఆమె ఈఈఎస్ఎల్ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో కేబుల్ పనికిరాకుండా పోయిందని ఎలక్ట్రికల్ ఇంజినీర్లు మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆమె స్పందిస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలించి కొత్త కేబుల్ వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమీక్షలో ఎస్ఈ కృష్ణారావు, ఎలక్ట్రికల్ ఈఈ సంజయ్కుమార్, ఈఈఎస్ఎల్ జిల్లా అధికారి రమేశ్, ఏఈ సంతోష్, సరిత, ఈఈ ఎస్ఎల్ ప్రతినిధులు బాలాజీ, సుధీర్, వెంకటేశ్ పాల్గొన్నారు.
గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో పని చేస్తున్న స్వచ్ఛ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్లకు ఐడీ, హెల్త్ కార్డులు ఇవ్వాలని 45వ డివిజన్ కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్ నేతృత్వంలో స్వచ్ఛ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ మేయర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఐదేళ్లుగా కార్పొరేషన్ పరిధిలో 163 మంది స్వచ్ఛ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ పని చేస్తున్నామని మేయర్కు వివరించారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఐడీ కార్డులతోపాటు హెల్త్ కార్డులు అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. మేయర్ను కలిసిన వారిలో స్వచ్ఛ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ మురళీకృష్ణ, విజయకుమార్, రాజు, సురేందర్, మోహన్, శ్రీనివాస్, కత్తి రవి, రాజు ఉన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును మేయర్ గుండు సుధారాణి మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసిన ఆమె పూల మొక్క అందించి నూతన సంవత్సర, ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
మేయర్ గుండు సుధారాణికి మహిళా కార్పొరేటర్లు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్, డిప్యూడీ మేయర్, కార్పొరేటర్లు కేక్ కట్ చేశారు. డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు మేయర్కు కేక్ తినిపించి పూల మొక్కలు అందజేశారు. అనంతరం శాలువాలతో సత్కరించి సంబురాలు చేసుకున్నారు. మేయర్ను కలిసిన వారిలో కార్పొరేటర్లు గుంటి రజిత, అవాల రాధికారెడ్డి, మానస, జక్కుల రజిత, విజయశ్రీ రజాలి, గుండు చందన, జన్ను షిభారాణి, గుజ్జుల వసంత, అరుణా విక్టర్, దేవరకొండ విజయలక్ష్మి, మునిగాల సరోజన, చీకటి శారద, గుగులోత్ దివ్యవాణి ఉన్నారు.