వరంగల్, నవంబర్ 22 : భద్రకాళి ఆలయంలో రాజగోపురంతోపాటు చుట్టూ మాడ వీధులు ఆగమ శాస్త్ర ప్రకారం నిర్మించేలా అధికారులు చర్యలు చేపట్టారు. దేవాదాయ శాఖ స్థపతి వల్లీనాయగం, అసిస్టెంట్ స్థపతి గణేశన్, దేవాదాయ ఎస్ఈ మల్లికార్జున్తో పాటు రెవెన్యూ, కుడా, ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో మంగళవారం స్థల పరిశీలన చేశారు. భద్రకాళి ఆలయ రాజగోపురంతోపాటు చుట్టూ ప్రాకార మండపాన్ని శాస్త్ర ప్రకారం నిర్మించాల్సిన ఆవశ్యకతను స్థపతులు అధికారులకు వివరించారు. దీంతో పాటు మాడ వీధుల నిర్మాణ రీతులను శాస్త్ర సంబంధమైన వివరాలను వెల్లడించారు. ఆగమ శాస్త్రం ప్రకారం రాజగోపురంతో పాటు మాడ వీధుల నిర్మాణానికి స్థపతులు సూచనలు చేశారు.
నేటి నుంచి సర్వే
మాడ వీధుల స్థల సర్వేను కుడా, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు బుధవారం నుంచి చేపట్టనున్నారు. ఆలయం చుట్టూ ఏ దిక్కున ఎంత స్థలం ఉందన్న వివరాలను సేకరించేలా సర్వే నిర్వహించనున్నారు. సర్వే పూర్తి చేసిన అనంతరం వచ్చే వారంలో దేవాదాయ శాఖ స్థపతులతో సమావేశం ఏర్పాటు చేయనుంది. స్థల పరిశీలనలో ఆర్డీవో వాసుచంద్ర, కుడా ప్లానింగ్ అధికారి అజిత్రెడ్డి, ఈఈ భీంరావు, దేవాదాయ శాఖ ఉప కమిషనర్ కాంతారావు, సహాయ కమిషనర్ రామల సునీత, భద్రకాళి ఆలయ ఈవో శేషుభారతి, ప్రధాన అర్చకుడు శేషు, నిట్ ప్రొఫెసర్లు కామేశ్వర్రావు, ప్రసాద్, దేవాదాయ శాఖ ఈఈ దుర్గాప్రసాద్, డీఈ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.