భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, ముఖ్యంగా వ్యవసాయరంగానికి మరింత సాంకేతిక ఊతమిచ్చే విధంగా వరంగల్లోని నిట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇక్కడ సాంకేతిక పరిశోధనలను విస్తృతం చేయడంతో పాటు సాగురంగానికి వీటిని అనుసంధానం చేసేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు అవసరమైన నిర్మాణాల కోసం మరో 100 ఎకరాలు కేటాయించాలని డిసెంబర్ 3న హనుమకొండ కలెక్టర్ను నిట్ డైరెక్టర్ బిద్యాదర్ సుబుధి కోరారు. నిట్లో శాటిలైట్ క్యాంపస్ విస్తరణ ప్రణాళిక ఉన్నదని పేర్కొన్నారు. 25కిలోమీటర్ల పరిధిలో ఉన్న ధర్మసాగర్ మండలం దేవునూరు, ముప్పారంలో భూములను వరంగల్ నిట్ ఎక్స్టెన్షన్ క్యాంపస్కు ఇచ్చేలా హనుమకొండ జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన విధానాలతో వ్యవసాయరంగం సమగ్రంగా అభివృద్ధి చెందింది. ప్రతి ఎకరాకు సాగునీరు, ఉచిత కరెంటు, పెట్టుబడి సాయం అందడంతో పంటల విస్తీర్ణం, ఉత్పత్తి అనూహ్యంగా పెరిగాయి. వరంగల్ నిట్ సమీపంలో ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో రికార్డు స్థాయిలో పంటల దిగుబడులు వస్తున్నాయి. ఈ క్రమంలో సాంకేతికతను అనుసంధానం చేసి వ్యవసాయానికి మరింత తోడ్పాటును అందించేందుకు వరంగల్ నిట్ ప్రణాళికలు రూపొందిస్తున్నది. వరంగల్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అనుసంధానంతో ఇప్పటికే డ్రోన్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. పంటల వారీగా అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు వీలుగా నిట్లోనూ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కోర్సులను అమలు చేసేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వ్యవసాయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కావాల్సిన వాహనాలు, యంత్రాలు, పరికరాల ఆవిష్కరణ, తెలంగాణలో పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయానికి ఉపయోగపడే ఇతర పరిశోధనలు చేసేలా ఈ కోర్సులు ఉండనున్నాయి.
ప్రస్తుతం 248 ఎకరాల్లో బోధన, వసతి సౌకర్యాలు, అధునాతన పరిశోధన కేంద్రాలు, ప్రయోగశాలలు, సెంట్రల్ లైబ్రరీ, స్టూడెంట్ సెంటర్లతో వరంగల్ నిట్ కొనసాగుతున్నది. ఇంజినీరింగ్, సాంకేతిక నైపుణ్యాల హబ్గా అభివృద్ధి చెందిన వరంగల్ నిట్, కొత్త ఆవిష్కరణలు, పరిశోధనలు, పరిశ్రమల అనుబంధ కోర్సులు అందిస్తూ అగ్రశ్రేణిగా గుర్తింపు పొందింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డొమైన్లలో ఈ సంస్థ పూర్వ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న నిట్లలో వరంగల్ నిట్ మంచి ఫలితాలతో 17వ స్థానంలో ఉన్నది. వరంగల్ నిట్లో రూపొందిన ఈ-వాహనాలు, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ ఇప్పటికే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ఈ క్రమంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వరంగల్ నిట్ను అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. శాటిలైట్ క్యాంపస్ ఏర్పాటుకు అనుగుణంగా కోర్సును రూపొందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఉన్నత్ భారత్ అభియాన్’లో భాగంగా గ్రామాలను దత్తత తీసుకుని వ్యవసాయ రంగానికి సాంకేతికతను అనుసంధానం చేసే ప్రక్రియ కీలకంగా ఉండనుంది. వ్యవసాయంతో పాటు, రైల్వే రంగంలోనూ పరిశోధనల కోసం రైల్వే ఇంజినీరింగ్ కోర్సులు ప్రవేశపెట్టేందుకు వరంగల్ నిట్ ప్రణాళికలు రూపొందిస్తున్నది.