మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. కోట్లాది రూపాయలతో కార్పొరేట్ స్థాయి హంగులు కల్పిస్తున్నారు. విద్యుదీకరణ, తరగతి గదుల నిర్మాణం, తాగునీటి సరఫరా, మేజర్, మైనర్ రిపేర్లు, డైనింగ్ హాల్, ప్రహరీ, నీటి వసతితో టాయిలెట్స్, కిచెన్ షెడ్ల నిర్మాణం, పెయింటింగ్ తదితర పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. అభివృద్ధి చేసిన పాఠశాలల్లో లైబ్రరీ కార్నర్ల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. వీటిలో పుస్తకాలను అందుబాటులో ఉంచితే ఖాళీ సమయంలో విద్యార్థులు చదువుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. మార్గదర్శకాల ప్రకారం లైబ్రరీ కార్నర్ల ఏర్పాటుకు విద్యాశాఖ అధికారులు జిల్లాలో 152 ప్రభుత్వ పాఠశాలలను ప్రతిపాదించారు. వీటిలో 144 స్కూళ్లను ఎంపిక చేసింది.
వరంగల్, జనవరి 22(నమస్తేతెలంగాణ): ‘మన ఊరు-మన బడి’, ‘మన బస్తీ-మన బడి’ కార్య క్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారి పో తున్నాయి. కోట్లాది రూపాయలతో కార్పొరేట్ స్థాయి రూపుదిద్దుకుంటున్నాయి. అభివృద్ధి చేసిన పాఠశాలల్లో లైబ్రరీ కార్నర్ల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. జిల్లాలో లైబ్రరీ కార్నర్లను నెలకొల్పేందుకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 144 పాఠశాలలను సెలెక్ట్ చేసింది. దీంతో వీటిలో లైబ్రరీ కార్నర్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. విద్య కు అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఈ ఏడాది మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా విడుతల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి నిర్ణయించింది.
ఈ క్రమంలో తొలివిడుత ఈ ఏడాది అభివృద్ధి పనులు చేపట్టడానికి ముప్పైమూడు శాతం పాఠశాలలను గుర్తించింది. దీని లో భాగంగా జిల్లాలో గుర్తించిన 223 పాఠశాలల్లో అవసరాలను గుర్తించిన అధికారులు అభివృద్ధి పనుల కోసం రూ. 56.75 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఇంజినీర్ల నుంచి అందిన ప్రతిపాదనలు పరిశీలించిన తర్వాత దశలవారీగా 222 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పాలనపరమైన అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అధికారులు రూ. 30 లక్షలలోపు విలువైన పనులు చేయాల్సి ఉన్న పాఠశాలల అభివృద్ధి పనులను స్కూల్ మేనేజ్మెంటు కమిటి(ఎస్ఎంసీ)లకు అప్పగించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. అగ్రిమెంట్ చేసుకున్న ఎస్ఎంసీలు పాఠశాలల్లో నిర్దేశించిన అభివృద్ధి పనులు చేస్తున్నారు.
విద్యుదీకరణ, తరగతి గదుల నిర్మాణం, తాగునీటి సరఫరా, మేజర్, మైనర్ రిపేర్లు, డైనింగ్ హాలు, ప్రహరీగోడ, నీటి వసతితో టాయిలెట్స్, కిచెన్ షెడ్ల నిర్మా ణం, పెయింటింగ్ తదితర పనులు యుద్ధ్దప్రాతిపదికన చేస్తున్నారు. మండలానికో రెండు పాఠశాలలను ప్రారంభానికి అధికారులు సిద్ధం చేశారు. ఈ లెక్కన జిల్లాలో 13 మండలాల్లో 26 ప్రభుత్వ పాఠశాలల్లో పెయింటింగ్ పనులు పూర్తి చేసి, అందంగా తీర్చిదిద్దారు. మోడల్గా మండలానికో రెండు స్కూళ్ల పనులను పూర్తి చేసిన అధికారులు ఇతర పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను కూడా సాధ్యమైనంత త్వర లో పూర్తి చేయడంపై దృష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీ కార్నర్ ఏర్పాటు చేసి, ఇందులో పుస్తకాలను సమకూర్చితే ఖాళీ సమయంలో విద్యార్థులు ఆ పుస్తకాలను చదువుకుంటారని, విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందడానికి ఈ లైబ్రరీ కార్నర్లు దోహదపడుతాయని ప్రభుత్వం భావిస్తున్నది.
ఈ నేపథ్యం లో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లైబ్రరీ కార్నర్ల ఏర్పాటుకు విద్యాశాఖ అధికారులు జిల్లాలో 152 ప్ర భుత్వ పాఠశాలలను ప్రతిపాదించారు. వీటిలో ప్రభు త్వం లైబ్రరీ కార్నర్ ఏర్పాటు కోసం 144 స్కూళ్లను ఎంపిక చేసింది. ఈ పాఠశాలల్లో 121 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, మిగతావి ప్రాథమికోన్నత పాఠశాలలు. 121 ప్రాథమిక పాఠశాలలు మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమం ద్వారా జిల్లా లో తొలివిడుత అభివృద్ధి పనులు చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఎంపిక ప్రక్రియ పూర్తయినందున త్వరలోనే జిల్లాలో 144 ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీ కార్నర్ల ఏర్పాటు జరిగే అవకాశం ఉందని తెలిపారు.
జిల్లాలో మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమం అమల్లో కొందరు అధికారుల తీరు ను కలెక్టర్ గోపి తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై శనివారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ప్రధానంగా టెండర్ ప్రక్రియ ద్వారా అభివృద్ధి పనులు జరగాల్సిన పాఠశాలల్లో అగ్రిమెంట్ పేరుతో కాలయాపన చేస్తూ పనులను మందకోడిగా చేస్తే.. ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
టెండర్ ప్రక్రియ పూర్తయి అగ్రిమెంట్ అయిన పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా పేరుగాంచిన గీసుగొండ మండలం గంగదేవిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలోనూ అభివృద్ధి పనులు సరి గా కాకపోవడానికి కారణాలను సంబంధిత ప్రత్యేక అధికారి, ఇంజినీరింగ్ అధికారులు తెలుపాలన్నారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం అభివృద్ధి పనులపై నిర్వహించిన ఈ సమావేశానికి సైతం హాజరుకాని అధికారులకు తాఖీదులు జారీ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
దీంతో ఈ కార్యక్రమం అమలుపై ప్రత్యేక అధికారులు, వివిధ ఇంజినీరింగ్ విభాగాల అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. టెండర్ ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాల్సిన ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి సా రించారు. కొన్ని పాఠశాలల్లో తుది దశలో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయడం, మరికొన్ని పాఠశాలల్లో మందకొడిగా సాగుతున్న పనులను వేగవంతం చేయడం, పనులు మొదలు కాని, పాఠశాలల్లో వెంట నే ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించి ముందుకు వెళ్తున్నారు.