సంగీత విద్వాంసుడు పీవీఎస్ శాస్త్రికి సంగీత విద్యారణ్య అవార్డును అందజేస్తున్న ఎమ్మెల్యే నన్నపునేని, గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య, కేయూ వీసీ రమేశ్
గిర్మాజీపేట, జనవరి 13 : వరంగల్లోని పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శుక్రవారం ఎన్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యారణ్య ఆర్ష ధర్మ రక్షణ సంస్థ నిర్వహణలో భద్రకాళీ ఆలయ ప్రధాన అర్చకుడు శేషయ్య అధ్యక్షతన రాధాకృష్ణ గార్డెన్లో నిర్వహిస్తున్న త్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవాల ముగింపు సమావేశానికి హాజరయ్యారు. భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామితో కలిసి లోక కల్యాణార్థం రామమంత్ర సర్వస్వ యాగం చేశారు. అనంతరం ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు పుచ్చా వెంకట సూర్య శేషయ్యశాస్త్రికి సంగీత విద్యారణ్య బిరుదును ప్రదానం చేసి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశం ఓరుగల్లు వైపు చూసేలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండడానికి కళలు, క్రీడలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. త్వరలోనే జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తానన్నారు. గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. తాను కూడా చిన్నప్పటి నుంచి కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నానని, జిల్లా ప్రజలు కళలు, కళాకారులకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమన్నారు.
కేయూ వీసీ రమేశ్ మాట్లాడుతూ.. సంగీత పరిజ్ఞానాన్ని ఇప్పటి యువతకు డిస్టెన్స్ పద్ధతిలో అందించడానికి కృషి చేస్తానన్నారు. నిర్వహణ బాధ్యులు దిడ్డి కుమారస్వామి, రమేశ్బాబు, చింతాకుల సునీల్, దుబ్బ శ్రీనివాస్, నాగపురి సంజయ్బాబు, కేడల జనార్దన్, మనోహర్, మేడిది మధు, జోగు చంద్రశేఖర్, తోట నవీన్, గుండేటి నరేందర్, బోరిగం నర్సింగం, మీరిపల్లి వినయ్కుమార్, గోపన్న, కార్పొరేటర్లు చింతాకుల అనిల్, ప్రవీణ్, మరుపల్ల రవి, ముష్కమల్ల అరుణ, మాజీ కార్పొరేటర్ జారతి రమేశ్, పల్లం రవి పాల్గొన్నారు.