తుది దశకు చేరిన ప్రక్రియ
ఇప్పటి వరకు 79.8 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు
10,255 మంది ఖాతాల్లో రూ.94.25 కోట్లు జమ
మిగిలిన వారికి నాలుగైదు రోజుల్లో..
మరో వారం రోజుల్లో ముగియనున్న కొనుగోళ్లు
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. మరో వారం రోజుల్లో ముగియనున్నది. యాసంగి సీజన్లో 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 183 కేంద్రాల ద్వారా 17,613 మంది రైతుల నుంచి రూ.156.47కోట్ల విలువ చేసే 79,849 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇది ఇంకా పెరుగనున్నది. ఇప్పటికే 10,255 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.94.25కోట్లు జమ చేశారు. మిగిలిన వారికి మరో నాలుగైదు రోజుల్లో జమ కానున్నాయి. జూన్ 5 వరకు కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయని, ఈలోగా రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చి విక్రయించాలని అధికారులు కోరారు.
మహబూబాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోళ్లు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. ఏప్రిల్లో ప్రారంభించిన ధాన్యం సేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. మరో వారం రోజుల్లో కొనుగోళ్లు ముగియనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. 201 కేంద్రాలు ఏర్పాటు చేసి, కొనుగోలు చేయాలని భావించారు.
కానీ, 183 కేంద్రాల ద్వారానే కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభించారు. 16 మండలాల పరిధిలో మొత్తం 17,613 రైతుల నుంచి రూ.156.47కోట్ల విలువ చేసే 79,849 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రైతులు కల్లాల నుంచి కొనుగోలు కేంద్రాల వద్దకు తెచ్చి విక్రయిస్తున్నారు. 51 ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా 5,059 రైతుల నుంచి 23,022.950 మెట్రిక్ టన్నులు, 121 పీఏసీఎస్ కేంద్రాల ద్వారా 11,674 మంది రైతుల నుంచి 53,901.240, జీసీసీ-07 కేంద్రాల ద్వారా 360 మంది రైతుల నుంచి 1,272.280, మెప్మా ఒక కేంద్రం నుంచి 215 మంది రైతుల నుంచి 605.770, మూడు డీహెచ్ఎస్వో కొనుగోలు కేంద్రాల ద్వారా 305 మంది రైతుల నుంచి 1,047, మొత్తం 79,849.240 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. నిర్వాహకులు రైతులు అమ్మిన బస్తాలను లారీల ద్వారా సంబంధిత మిల్లులకు పంపిస్తున్నారు. మిల్లర్లు బస్తాల లెక్క సరి చూసుకొని ఓకే చేసిన తర్వాత 48గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. ఇప్పటికే రూ.94.25కోట్లను అధికారులు రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశారు.
రైతుల ఖాతాల్లో రూ. 94.25కోట్లు జమ
జిల్లాలో మొత్తం 183 కొనుగోలు కేంద్రాల ద్వారా 17,613 మంది రైతుల నుంచి 79,849 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇందులో 10,255 మంది రైతులకు రూ.94.25కోట్ల ధాన్యానికి సంబంధించిన డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో అధికారులు జమ చేశారు. మిగిలిన వారి డబ్బులు మరో నాలుగైదు రోజుల్లో జమ కానున్నాయి. జూన్ 5 వరకు కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగనున్న నేపథ్యంలో మొత్తం లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
తుది దశకు కొనుగోళ్లు..
జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. మరో వారం రోజుల్లో 183 కేంద్రాలను మూసివేస్తాం. ఈలోగా రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం అమ్మవచ్చు. ఇప్పటి వరకు 17,613 మంది రైతుల నుంచి రూ.156.47 కోట్ల విలువ చేసే 79,849 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ఇందులో 10,255 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.94. 25కోట్లను అధికారులు జమ చేశారు. మిగిలిన వారి డబ్బులు నాలుగైదు రోజుల్లో జమ చేస్తాం.
– మహేందర్, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్
కాంటా వేసిన మూడు రోజులకే పైసలు వచ్చినయ్..
యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన మూడు రోజులకే పైసలు బ్యాంకు ఖాతాలో నమోదయ్యాయి. నేను కాంటా పెట్టిన 38 క్వింటాళ్ల ధాన్యానికి సంబంధించిన పైసలు రూ.74480ఖాతాలో పడ్డయి. గతంలో ప్రైవేటు వ్యక్తులకు ధాన్యం అమ్మితే 5 నుంచి 20 రోజుల వరకు డబ్బులు ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో కాంటా పెట్టిన మూడు రోజులకే డబ్బులు వచ్చినాయ్..
–పుప్పాల సత్తయ్య, నర్సింహులపేట