హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 7 : లాల్ బహదూర్ కళాశాలకు ఎంతో ఘన చరిత్ర ఉన్నదని కేయూ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ అన్నారు. లాల్ బహుదూర్ కాలేజీ 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ వేడుకలను గురువారం కాలేజీ చైర్మన్ కే నిరంజన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేలాది మంది పేద విద్యార్థులు ఉన్నత స్థాయిలో స్థిరపడేందుకు ఇకడి అధ్యాపకులు, యాజమాన్యం చేసిన కృషి మరువలేనిదన్నారు. నిష్ణాతులైన అధ్యాపకులు ఉండడం వల్ల ఈ కళాశాలలో అడ్మిషన్ పొందితే ఉద్యోగం దొరికినంత సంబురంగా ఉండేదని, ఇప్పటికీ నాటి నాణ్యతా ప్రమాణాలు కొనసాగించడం సంతోషమని పేర్కొన్నారు. అలాగే యూనివర్సిటీతో పోటీబడ్డ ఏకైక కాలేజీ అని అన్నారు. దీన్ని గొప్పగా తీర్చిదిద్దిన అధ్యాపకులు, ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్, హైదరాబాద్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. 10వ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ అజయ్నంద కండూరి కాలేజీ పేరు ప్రతిష్టలను కొనియాడారు.
కాలేజీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం అన్ని రకాల ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు. మరిన్ని నూతన అవకాశాలను విద్యార్థులకు కల్పిస్తామని సెక్రటరీ ఈ రాజేందర్ తెలిపారు. విద్యతో పాటు ఎన్సీసీ, క్రీడలు, సామాజిక సేవా రంగాల్లో లాల్ బహదూర్ కళాశాల నగరానికే ఆణిముత్యమని 50 సంవత్సరాల ఘనకీర్తిని ప్రిన్సిపాల్ అరుణ వివరించారు. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం 50 వసంతాల ప్రత్యేక లోగోను వీసీ రమేశ్ చేతుల మీదుగా ఆవిషరించారు. కార్యక్రమంలో హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ సత్యేంద్ర వనం, చైర్మన్ కే నిరంజన్, సెక్రటరీ ఈ రాజేంద్రకుమార్, ట్రెజరర్ బొళ్ల ఆనందకుమార్, జాయింట్ సెక్రటరీ జీఎం రమేశ్, శకుంతల, జ్యోత్స్న, వినయ్కుమార్, నరేశ్కుమార్ పాల్గొన్నారు.