భీమదేవరపల్లి, జనవరి 16: కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఆది, సోమవారాల్లో భక్తులు ఆలయానికి పోటెత్తారు. కోనేరులో స్నానాలు చేసి స్వామివారికి కోరమీసాలు సమర్పించారు. కోడె మొక్కులు చెల్లించారు. గండాలు తొలిగిపోవాలని గండదీపంలో నూనె పోశారు. వీరభద్రుడి దర్శనానికి గంటల తరబడి క్యూ కట్టారు. జాతరలో దుకాణాలు, రంగులరాట్నం, సర్కస్ ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఆలయ చైర్మన్ మాడిశెట్టి కుమారస్వామి, ఈవో కిషన్రావు సదుపాయాలు కల్పించారు. ఆలయంలో ధర్మకర్తలు ఎల్తూరి ప్రభాకర్, భూక్య తులస్య, మఠం శ్రీశైలం, నాగపురి సతీశ్, ములుకనూరు ఏకేవీఆర్ జూనియర్, డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వలంటీర్లు భక్తులకు సేవలందించారు. జాతరలో నెత్తిన బోనాలతో మహిళలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
స్వామివారికి ఉత్తరాయణ పుణ్యకాల పూజ అనంతరం ఆవుపాలు, నవరసాలతో అభిషేకం, బిల్వదళార్చన మహాన్యాస పూర్వకంగా నిర్వహించారు. అనంతరం రుద్రయాగం చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. యాగశాలలో 365 దీపాలతో జ్యోతిర్లింగార్చన నిర్వహించారు.
మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహరావు ఇంటి నుంచి కొత్తకొండకు ఎడ్లబండి రథం మకరసంక్రాంతి రోజున వెళ్లడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఏడాది కూడా ఎడ్లబండి రథాన్ని అందంగా అలంకరించి శివసత్తుల నృత్యాలు, మహిళల కోలాటాల నడుమ రథాన్ని కొత్తకొండకు సాగనంపారు. పీవీ సోదరుడి కుమారుడు మదన్మోహన్రావు, ఇన్చార్జి సర్పంచ్ రాజు, ఎంపీటీసీ నల్ల కౌసల్య పాల్గొన్నారు.
సంక్రాంతి రోజున ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య, హనుమకొండ జడ్పీ అధ్యక్షుడు మారపల్లి సుధీర్కుమార్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ కుమారస్వామి, ఈవో కిషన్రావు వారికి సామివారి శేషవస్ర్తాలు సమర్పించి జ్ఞాపికను అందజేశారు. ఎంపీపీ జక్కుల అనిత, జడ్పీటీసీలు వంగ రవి, చాడ సరితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి రోజున వేలేరుకు చెందిన యాదవులు మేకలబండితో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం ఎడ్లబండ్లతో వచ్చిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామివారికి మొక్కులు చెల్లించారు. గుట్టపైన కొలువుదీరిన వీరభద్రస్వామి ఆత్మలింగం ఆలయంలోనూ భక్తులు పూజలు చేసి ప్రకృతి రమణీయతను ఆస్వాదించారు.
బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి అనే చందంగా కొత్తపల్లి నుంచి కొత్తకొండకు వచ్చిన ఎడ్లబండ్ల రథాలు అమితంగా ఆకట్టుకున్నాయి. 58 ఎడ్లబండ్లను పూలు, విద్యుత్ దీపాలు, వివిధ రంగులతో అందంగా అలంకరించి కొత్తకొండకు తీసుకొచ్చారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయగా భక్తులు తిలకించేందుకు దారుల వెంట బారులు తీరారు.