కరీమాబాద్, నవంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం.. డైరెక్టర్ల సహకారం.. చైర్మన్ కృషి.. వెరసి ఖిలావరంగల్ ప్రాథమిక సహకార సంఘం ఉత్తమంగా నిలిచింది. నగరంలో వ్యవసాయం చేసే రైతులు తక్కువగా ఉన్నా.. సంఘం ఆధ్వర్యంలో ఇతరత్రా వ్యాపారాలు చేపడుతూ సంఘానికి భారీ ఆదాయం వచ్చేలా కమిటీ చర్యలు చేపట్టింది. ఫలితంగా జిల్లా ఉన్నతాధికారుల చేతులమీదుగా ఇటీవల అవార్డును అందుకుంది ఖిలావరంగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం. గతంలో ఓ చిన్న గదిలో అద్దెకు ఉన్న సొసైటీ.. నేడు అద్దెలను ఆదాయంగా ఆర్జించే స్థాయికి ఎదిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి అందిస్తున్న చేయూతను సభ్యులు వినియోగించుకుంటూ ఓ భవనం కూడా నిర్మించారు. అంతటితో ఆగకుండా వ్యాపారంపై దృష్టి సారించి ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
సొసైటీ మండలంలో ఉన్న రైతుల సంక్షేమానికి కృషి చేస్తూనే వ్యాపారంతో దినదినాభివృద్ధి సాధిస్తున్నది. వ్యవసాయానికి అవసరమయ్యే పనిముట్లు, ఎరువులు, విత్తనాలను సైతం అందుబాటులో ఉంచుతుంది. రైతులకు రుణాలను అందించడంతోపాటు పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అండగా నిలుస్తున్నది. రైతులు పంటలు వేసే సమయంతోపాటు ఇతర వేళల్లో వ్యవసాయ అధికారులను కలిసేందుకు ఇబ్బందులు పడుతుండడంతో వ్యవసాయ శాఖ అధికారులకు భవనంలో ఓ గదిని సైతం కేటాయించింది. దీంతో రైతులకు అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నారు.
పలు వ్యాపారాల నిర్వాహణ, అద్దెల ద్వారా ఏటా ఖిలావరంగల్ పీఏసీఎస్కు దాదాపు రూ. 15 లక్షల ఆదాయం సమకూరుతున్నది. గతంలో సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్టల్లకు నిత్యావసర సరుకులను సరఫరా చేసే వ్యాపారం నిర్వహించారు. అందులో లాభాలు రావడంతో వారు తాజాగా వంటనూనె అమ్మకాలు చేపడుతున్నారు. దీనికితోడు భవనంలోని గదులను అద్దెకు ఇవ్వడంతో ప్రతి నెలా అద్దెల రూపంలోనూ సంఘానికి భారీగా ఆదాయం సమకూరుతున్నది. దీంతో ఒకప్పుడు అద్దె ఇంట్లో ఉన్న ఖిలావరంగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రసుత్తం సొంత భవనంతోపాటు అన్ని విధాలా అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నది.
ప్రభుత్వ సహకారంతోనే ఖిలావరంగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధి సాధించింది. ప్రభుత్వ అండదండలతో నూతన భవన నిర్మాణం, వ్యాపార నిర్వాహణ చేపట్టాం. నా తోటి డైరెక్టర్లు, సిబ్బంది సైతం ఎంతగానో సహకరిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఖిలావరంగల్ సొసైటీ ఉన్నంత కాలం నేను చేసిన పనులు గుర్తుండేలా చర్యలు చేపడుతున్నాం.
– కేడల జనార్దన్, ఖిలావరంగల్ సొసైటీ చైర్మన్