వరంగల్ చౌరస్తా, జూలై 22 : వైద్య రంగంలో స్వయం పరిశీలన, రీసెర్చ్ల ద్వారానే ఉత్తమ ఫలితాలను సాధించడం సాధ్యమవుతుందని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ కరుణాకర్రెడ్డి అన్నారు. కేఆర్డీ-23 పేరుతో కాకకతీయ మెడికల్ కళాశాలలో అలుమ్ని(కేఎంసీ పూర్వ విద్యార్థుల అసోసియేషన్) ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన రీసెర్చ్డే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ దేశం సమశీతోష్ణస్థితి కలిగి ఉండడం, అధిక జనాభా ఉండడం వల్ల మానవులకు సంక్రమించే అన్ని రకాల వ్యాధుల వివరాలను సేకరించి, పరిశోధన చేయడం సులభమన్నారు. అందుకే ఇతర దేశాల వైద్యవిద్యార్థులు మన దేశంలో పరిశోధనలు చేయడానికి వస్తున్నారన్నారు.
వైద్యరంగంలో రాణించాలనుకునే వారు ఇప్పటి నుంచే మానవుడి జీవితంలో సంక్రమించే వ్యాధులపై పరిశోధనా ధోరణిని అలవాటు చేసుకోవాలన్నారు. వ్యాధుల వ్యాప్తి, నివారణ చర్యలు, మనిషిపై పడే ప్రభావం లాంటి అంశాలను పరిశీలించడం వల్ల వ్యాధి నివారణకు తక్కువ సమయంలోనే పరిష్కారాన్ని కనుక్కోవచ్చునన్నారు. ప్రతి వైద్య విద్యార్థి నిత్య విద్యాభోదనలో పరిశీలన, పరిశోధనను అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. అనంతరం కాకతీయ రీసెర్చ్ డే పేరుతో ఏర్పాటు చేసిన క్రానికల్ను ఆవిష్కరించారు. రానున్న రోజుల్లో ప్రతి మూడు నెలలకు ఒక క్రానికల్ని రూపొందించేలా విద్యార్థులకు ప్రోత్సాహకాన్ని అందిస్తామన్నారు. తెలంగాణలో కాకతీయ మెడికల్ కళాశాల విద్యాభోదన రంగాన్ని పటిష్టం చేయడానికి, ఉత్తమ ర్యాకింగ్లో నిలుపడానికి అలుమ్ని చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు.
కళాశాల విద్యార్థుల కోసం అమెరికాలో స్థిరపడిన వైద్యులతో ఆయా విభాగాల వారీగా ఆన్లైన్ విధానంలో నెలలో మూడో శనివారం తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఎంచుకున్న అంశాల్లో రీసెర్చ్ చేసి తమ ఆలోచనలు, వారి పరిశీలలను తోటి విద్యార్థులతో పంచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ప్రతి విద్యాసంవత్సరం నిర్వహించాలని తీర్మానించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు విద్యార్థులను ఉద్దేశించి తమ సలహాలు, సూచనలు అందించారు. అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు రీసెర్చ్ విభాగంలో తమ అనుభవాలను వివరించారు. కాగా, విద్యార్థులను నాలుగు విభాగాలుగా ఏర్పాటు చేసి, వైద్యరంగానికి సంబంధించిన ప్రశ్నలతో క్విజ్, డిబెట్ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కేఎంసీతో పాటు దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల నుంచి సుమారు 50 మంది పాల్గొన్నారు.