నందనా గార్డెన్లో ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు
మహబూబాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) : కాకతీయ వైభవ సప్తాహం జిల్లాలో ఒకరోజు ఘనంగా జరిపేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 9న జిల్లా కేంద్రంలోని నందనా గార్డెన్లో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శశాంక సంబంధిత శాఖల అధికారులను ఆదేశించగా, ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కార్యక్రమ నిర్వహణపై ఇప్పటికే కలెక్టర్ రెండుసార్లు సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ మేరకు కాకతీయుల వైభవాన్ని ప్రపంచానికి చాటేలా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పలు కార్యక్రమాలు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ముఖ్య అతిథులుగా జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. తెలంగాణ వంటకాలను అందరికీ పరిచయం చేసేలా స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. కాకతీయుల కాలం నాటి కట్టడాలకు సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శన, కవి సమ్మేళనం, పేరిణి నృత్యం, నాటికలు, తెలంగాణ సాంస్కృతిక ప్రదర్శనలు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు. కాకతీయ వైభవ సప్తాహాన్ని విజయవంతం చేసేలా డీఆర్డీవో సన్యాసయ్య, ఉద్యాన శాఖ జిల్లా అధికారి సూర్యనారాయణ, పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి సుధాకర్, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కవితకు బాధ్యతలు అప్పగించారు.