హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 23 : హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కాకతీయ కబడ్డీ ప్రీమియర్ లీగ్ సీజన్-2లో భాగంగా హనుమకొండ, వరంగల్ జిల్లాల సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. హనుమకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన కబడ్డీ క్రీడాకారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహమ్మద్ అజీజ్ఖాన్ హాజరై మాట్లాడుతూ క్రీడాకారుల భవిష్యత్ కోసం జిల్లాస్థాయి టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు షెడ్యూల్ ఏర్పాటు చేసుకుని నిబద్ధత, క్రమశిక్షణతో కబడ్డీని సాధన చేస్తూ పోటీల్లో పాల్గొనాలని సూచించారు. కబడ్డీకి పూర్వవైభవం తీసుకొస్తామని, క్రీడాకారులను అన్నివిధాలా ప్రోత్సహించేందుకు ఈ పోటీలు ఎంతో దోహదపడతాయన్నారు.
40సంవత్సరాలుగా కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు, క్రీడాకారుడి నుంచి అసోసియేషన్ బాధ్యుడిగా ఉన్నానని తెలిపారు. మూడున్నర నెలల పాటు కొనసాగే ఈ టోర్నమెంట్స్లో మంచి కబడ్డీ క్రీడాకారులను ఎంపిక చేసి 8 టీంల ద్వారా ప్రతి ఆదివారం 2 మ్యాచ్లు, 14 ఆదివారాల పాటు నిర్వహించనున్నట్లు చెప్పారు. జనవరి రెండోవారంలో నాలుగు మ్యాచ్లతో ముగింపు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో గెలుపొందిన జట్టుకు మొదటి నగదు బహుమతి రూ.30 వేలు, రెండో బహుమతి రూ.20 వేలు, మూడో బహుమతి రూ.15 వేలు, నాలుగో బహుమతి రూ.10 వేలతో పాటు కన్సోలేషన్ కింద ప్రైజ్మనీ అందజేయనున్నట్లు తెలిపారు. డీవైఎస్వో గుగులోత్ అశోక్కుమార్నాయక్ మాట్లాడుతూ ఏదో ఒక క్రీడతో జేఎన్ఎస్ కళకళలాడుతుందన్నారు. జేఎన్ఎస్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, కబడ్డీ అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల సారంగపాణి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) పరకాల నా యకుడు సోదా రామకృష్ణ, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కైలాశ్యాదవ్, సృజన్కాంత్, నలుబో లు సతీశ్, సురేశ్, రాంరెడ్డి, కృష్ణచైతన్య, సాంబమూర్తి, దేవేందర్, మల్లికార్జున్, అక్తర్ పాల్గొన్నారు.