జయశంకర్ భూపాలపల్లి : ప్రతిపక్షాల గారడి మాటలు నమ్మొద్దు అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి మండలం కొంపెల్లి, వజినపల్లి, నేరేడుపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పలు అభివృద్ధి పనులకు ఆదివారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఆచరణకు నోచుకోని హామీలు ఇస్తున్నాయని మండిపడ్డారు. ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయని హామీలు ఇక్కడ ఎలా చేస్తారని ప్రశ్నించారు.
పనిచేసే ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరారు. అనంతరం నేరేడుపల్లి, వజిన పల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. పార్టీ విజయం కోసం కలిసికట్టుగా పని చేయాలన్నారు. ఈ కార్యర్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.