కరోనా ట్రీట్మెంట్ ఖర్చుకు వెనుకాడని రాష్ట్ర సర్కారు
కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న ప్రభుత్వం
భూపాలపల్లి జిల్లాలో ఇప్పటివరకు వేలాది మందికి చికిత్స
ఉన్నత స్థాయి సదుపాయాలతో ప్రత్యేక వైద్యసేవలు
అందుబాటులో 20వేల ఐసొలేషన్ కిట్లు
సరిపడా ఆక్సిజన్ నిల్వలు
పర్యవేక్షిస్తున్న లైజనింగ్ ఆఫీసర్ విఠలేశ్వర్, డీఎస్వో రవికుమార్
భూపాలపల్లి టౌన్, మే 14 : కొవిడ్ బాధితుల చికిత్స కోసం ఖర్చుకు వెనుకాడకుండా ప్రభు త్వం అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్న ది. ఇందుకుగాను అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో సదుపాయాలు మెరు గు పరుస్తూ కొవిడ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. పాజిటివ్ రోగులతో పాటు సాధారణ వ్యాధులున్న వారికి వైద్యం అందిస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు రెండు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఒక సింగరేణి వైద్యశాలలో కరోనా చికిత్స అందిస్తున్నారు. వీటిలో ఆరు ప్రభుత్వ క్వారంటైన్లు, మూడు ఐసొలేషన్ సెంటర్లతో పాటు ఐదు ప్రైవేట్ హాస్పిటళ్లలో కరోనా రోగులకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. వీరికి రోజూ పూర్తిస్థాయిలో పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తున్నారు. రోజు డ్రై ఫూట్స్, కోడిగుడ్లు, వారానికి ఒకసారి భోజనంలో చికెన్ లేదా మటన్ పెడుతున్నారు. అంతేగాక జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలల్లో బెడ్లు, ఆక్సిజన్, ఐసొలేషన్ సెంటర్లలో స్థితిగతులు తదతర అంశాలను ఎప్పటికప్పుడు ఎంజీఎం నుంచి లైజనింగ్ అధికారి డాక్టర్ విఠలేశ్వర్, ఆన్లైన్లో డిస్ట్రిక్ట్ సర్వైలెన్స్ ఆఫీసర్ డాక్టర్ రవికుమార్ పర్యవేక్షిస్తున్నారు.
20వేల కిట్లు సిద్ధం
ఐసొలేషన్ కిట్స్, ప్రైమరీ కిట్స్ 20 వేలకు పైగా సిద్ధంగా ఉన్నాయని, బఫర్ స్టాక్ కోసం ఇండెంట్ పెట్టినట్లు డీఎంహెచ్వో డాక్టర్ సుధార్సింగ్ తెలిపారు. జిల్లాలోని అన్ని దవాఖానల్లో ఆక్సిజన్ కొరత లేదని, ఎంపిక చేసిన ఐదు ప్రైవేట్ హాస్పిటళ్లలో ఆక్సిజన్ సిలిండర్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రోజూ 45 నుంచి 50 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నట్లు చెప్పారు. ఐసొలేషన్, ప్రైమరీ కిట్స్ అం దించడంతో పాటు ఆశ, ఏఎన్ఎం, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది రోజూ ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. పేషెంట్లు క్రిటికల్గా ఉంటే ములుగు లేదా ఎంజీఎం దవాఖానకు పంపిస్తున్నారు.
చికిత్సకు రూ.కోట్లలో ఖర్చు
జిల్లాలో కరోనా పేషెంట్లకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నది. జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చిన రోగులు, సాధారణ వ్యాధులు కలిగిన వారితో కలిపి లక్షా 10వేల మందికి చికిత్స అందించినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ఒక్కో ఐసొలేషన్ కిట్కు రూ.500 ఉంటుందని, ప్రభుత్వ క్వారంటైన్, ప్రభుత్వ ఐసొలేషన్లో ఉన్న వారికి ఒక్కొక్కరికి రోజుకు ఆహారానికి రూ.330 ఖర్చు చేస్తున్నామని, ఇలా 14రోజులు భోజనం పెట్టాల్సి ఉంటుందని డీఎస్వో డాక్టర్ రవికుమార్ తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 8,643 ఐసొలేషన్ కిట్లు అందించామని, ఆక్సిజన్ అవసరమైతే ఒక్కొక్కరికి రోజుకు రూ.1500 నుంచి రూ.2వేలు ఖర్చవుతుందని చెప్పారు.