వరంగల్, డిసెంబర్ 20 : వివిధ సమస్యలపై బల్దియా గ్రీవెన్స్లో ఇచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని బాధితులు కోరారు. బల్దియా గ్రీవెన్స్లో అనేక సార్లు వినతులు ఇచ్చినా పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం బల్దియా కౌన్సిల్ హాల్లో నిర్వహించిన గ్రీవెన్స్లో ప్రజల నుంచి అధికారులు వినతులు స్వీకరించారు. ప్రతి వారం మాదిరిగానే ఈ వారం గ్రీవెన్స్లో టౌన్ ప్లానింగ్ విభాగానికి ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. కాలనీల్లో రోడ్డు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని, అక్రమ నిర్మాణాలు, రోడ్డు ఆక్రమణలు, టీఎస్-బీపాస్, పారిశుధ్యం లాంటి సమస్యలపై వినతులు వెల్లువెత్తాయి. 11వ డివిజన్లోని కాపువాడ శ్మశానవాటికలో సెల్ టవర్ ఏర్పాటును స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, దీనికి ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని డివిజన్ టీఆర్ఎస్ నాయకుడు దేవరకొండ సురేందర్ నేతృతంలో కాలనీ వాసులు గ్రీవెన్స్లో వినతి పత్రం అందజేశారు. 66వ డివిజన్ హసన్పర్తిలోని కుడా లేఅవుట్ శివసాయి కాలనీలో ఎలాంటి మౌలిక వసతులు లేవని, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాలని, కాలనీలోని పార్కు స్థలానికి ప్రహరీ నిర్మించాలని కాలనీ వాసులు విన్నవించారు. భవన నిర్మాణ అనుమతి కోసం టీఎస్ బీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకుని, నెల రోజులు కావొస్తున్నా ఇప్పటి వరకు సైట్ ఇన్స్పెక్షన్ చేయలేదని, దీంతో భవన నిర్మాణంలో ఆలస్యం జరుగుతోందని శివనగర్కు చెందిన వేణుమాధవ్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. 11వ డివిజన్ కాపువాడలోని ఓవీధిలో రోడ్డు, డ్రైనేజీ సౌకర్యం లేనది కాలనీవాసి రాజ్కుమార్ వినతిపత్రం అందజేశారు. గ్రీవెన్స్లో మొత్తం 39 వినతులు రాగా, అందులో టౌన్ప్లానింగ్ విభాగానికి 28, ఇంజినీరింగ్కు 6, ప్రజారోగ్య విభాగానికి ఒకటి, పన్నుల విభాగానికి నాలుగు వినతులు వచ్చాయి. గ్రీవెన్స్లో చీఫ్ ఎంహెచ్వో రాజారెడ్డి, సిటీ ప్లానర్ వెంక న్న, సీహెచ్వో సునీత , డిప్యూటీ కమిషనర్ రవీందర్ యాదవ్, పన్నుల అధికారి శాంతికుమార్, ఈఈలు, డీఈ పాల్గొన్నారు.