ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఉచితంగా సేవలు
ఇప్పటికే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అందుబాటులో వైద్యం
తాజాగా ఎయిడ్స్ రోగుల కోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం
వరంగల్ ఎంజీఎం దవాఖానలో సెంటర్ నెలకొల్పేందుకు కసరత్తు
యుద్ధప్రాతిపదికన వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు
రోగుల వివరాలు సేకరించే పనిలో వైద్యాధికారులు
వరంగల్, నవంబర్ 26(నమస్తేతెలంగాణ) : పేద ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నది. సర్కారు దవాఖానల్లో కార్పొరేట్కు దీటుగా అధునాతన వైద్యసేవలు అందిస్తున్నది. తాజాగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందించేందుకు కసరత్తు చేస్తున్నది. మంత్రి హరీశ్రావు హైదరాబాద్లో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించి హైదరాబాద్, వరంగల్లో వీరి కోసం ప్రత్యేకంగా ఒక్కో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. సాధ్యమైనంత త్వరలో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తలమునకలయ్యారు. ఎయిడ్స్, హెపటైటిస్ రోగుల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
తెలంగాణ ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నది. ప్రతి జిల్లాలో ప్రజలకు వైద్య సేవలను విస్తృతం చేస్తున్నది. తాజాగా వరంగల్లో కిడ్నీ సంబంధ వ్యా ధులతో బాధపడుతున్న ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఉచితంగా డయాలసిస్ సేవలను అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. సాధ్యమైనంత త్వర లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చే పనిలో తలమునకలయ్యారు. బుధవారం హైదరాబాద్లో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి హరీశ్రావు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఉచితంగా డయాలసిస్ సేవలను అందించేందుకు హైదరాబాద్, వరంగల్లో ఒక్కో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొత్తగా నెలకొల్పే ఈ ప్రత్యేక డయాలసిస్ కేంద్రాల్లో ఈ రోగులకు ఐదు చొప్పున బెడ్లు కేటాయించాలని సూచించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తు లు డయాలసిస్ చేయించుకోవడం ఆర్థికంగా భారంగా మారడంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రత్యేకంగా ఉచిత కేంద్రాలను ఏర్పాటు చేశారని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 43 ఉచిత డయాలసిస్ కేంద్రాలు పనిచేస్తున్నాయని, వీటి ద్వారా పది వేల మంది రోగులకు నిత్యం సేవలు అందుతున్నాయని చెప్పారు. ఈ కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం ఏటా రూ.100 కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. బాధితుల తాకిడి ఎక్కువగా ఉన్న కేంద్రాలను గుర్తించి అదనపు డయాలసిస్ యంత్రాల కోసం ప్రతిపాదనలు తయారు చేయాలని కూడా మంత్రి హరీశ్రావు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈనేపథ్యంలో ఎంజీఎం దవాఖానలోని డయాలసిస్ కేంద్రానికి అదనపు యంత్రాలు వచ్చే అవకాశం ఉంది.
డయాలసిస్ సేవల విస్తరణ..
కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉచిత డయాలసిస్ సేవలను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన విస్తరిస్తున్నది. గతంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో కేవలం ఇక్కడి ఎంజీఎంలో మాత్రమే ప్రభు త్వ ఆధ్వర్యంలో పనిచేసే ఉచిత డయాలసిస్ కేంద్రం ఉండేది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాలు ఉమ్మడి జిల్లాకు మరో మూడు వచ్చా యి. వీటితో పాటు ఎంజీఎం దవాఖానలోని డయాలసిస్ కేంద్రంలో కిడ్నీ సంబంధిత వ్యాధి బాధితులకు సేవలను ప్రభుత్వం విస్తృతం చేసింది. 2018 మార్చి నుంచి వరంగల్ ఎంజీఎం, నర్సంపేట, జనగామ, మ హబూబాబాద్ దవాఖానల్లో ఈ ఉచిత సెంటర్లు రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. ఎంజీఎం దవాఖానలోని డయాలసిస్ కేంద్రంలో పద్నాలుగు యం త్రాల ద్వారా రోగులకు ప్రభుత్వం ఉచిత సేవలు అందిస్తున్నది. ఇక్కడ 120 మంది రోగులు సేవలు పొందుతున్నారు. ఒక్కో యంత్రంపై ప్రతిరోజు గరిష్ఠంగా నలుగురు నుంచి ఐదుగురు రోగులకు వైద్యం అందిస్తున్నారు. ఇక్కడ రోగులు వారంలో రెండు లేదా మూడు రోజులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. వరంగల్, హనుమకొండతో పాటు ములుగు, భూపాలపల్లి జిల్లాల నుంచి కూడా బాధితులు ఈ కేంద్రానికి వస్తున్నారు. రోగులు ప్రైవేట్ దవాఖానలో ఒకసారి డయాలసిస్ చేయించుకుంటే మందుల ఖర్చు సహా రూ.4వే ల నుంచి రూ.5 వేలు వెచ్చించాల్సిన పరిస్థితి. ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాల్లో వారంలో మూడుసార్లు రూ. 15వేల విలువైన సేవలు ఉచితంగా పొందుతున్నారు.
ఆరోగ్యశ్రీ నుంచి ఇంజిక్షన్లు..
ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం కిడ్నీ సంబంధిత వ్యాధుల బాధితుల్లో రక్తం తక్కువగా ఉన్న వారికి ఇంజిక్షన్లు కూడా ఉచితంగా సమకూర్చుతున్నది. వారానికి ఒకసారి ఎరిత్రోపాయిటివ్, పదిహేనురోజులకు ఒకసారి ఐరన్, మల్టీ విటమిన్ ఇంజిక్షన్లను ఇస్తున్నది. ఎంజీఎంలోని డయాలసిస్ కేంద్రంలో హెపటైటిస్ బీ, సీ రోగులకు కూడా ప్రభుత్వం ఉచిత సేవలను అందిస్తున్నది. ప్రతిరోజూ హెపటైటిస్ బీ రోగులు పన్నెండు మంది, హెపటైటిస్ సీ రోగులు ముగ్గురు ఈ కేంద్రంలో ఉచిత డయాలసిస్ సేవలు పొందుతున్నారు. తమ గ్రామాల నుంచి ఉచిత డయాలసిస్ కేంద్రాలకు చేరుకోవడానికి ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు బస్ పాసులు అందజేసింది. ఏడాది నుంచి ఈ పాసులతో రోగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా ప్రభుత్వ డయాలసిస్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. రోగుల తాకిడి ఎక్కువగా ఉన్నందున ఎంజీఎం దవాఖానలోని ఉచిత డయాలసిస్ కేంద్రంలో అదనపు యంత్రాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
కొత్తగా ప్రత్యేక సెంటర్..
ప్రభుత్వ ఆదేశాలతో కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఎయిడ్స్ రోగులకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందించేందుకు ఎంజీఎం దవాఖానలో ప్రత్యేక సెంటర్ను ఏర్పాటు చేసే దిశలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అడుగులు వేస్తున్నారు. ప్రత్యేక కేం ద్రం ఏర్పాటుపై హైదరాబాద్ నుంచి ఈ శాఖ ఉన్నతాధికారులు ఇక్కడి వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఫో న్ ద్వారా మాట్లాడారు. ఎయిడ్స్ రోగులు, వీరిలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్యపై ఆరా తీశారు. కేవలం వరంగల్ జిల్లాలోనే 1,810 మంది ఎయిడ్స్ రోగులు ఉన్నారని, వీరికి ఎంజీఎం దవాఖానలోని ఏఆర్టీ సెంటర్ ద్వారా ఉచితంగా పరీక్షలు జరిపి నెలనెలా మందులు ఇస్తున్నట్లు స్థానిక వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న డయాలసిస్ కేంద్రం పనితీరుపైనా చర్చ జరిగింది. ఈ క్రమంలో దీని పక్కనే ఎయిడ్స్ రోగులకు ఉచిత డయాలసిస్ సేవలు అందించే ప్రత్యేక కేంద్రం నెలకొల్పాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఇక్కడి ఎయిడ్స్ రోగులు ఉచిత డయాలసిస్ సేవల కోసం హైదరాబాద్కు వెళ్తున్నారు. ఎంజీఎం దవాఖానలో ప్రత్యేక కేంద్రం ఏర్పడితే ఇక్కడే ఉచిత డయాలసిస్ సేవలను పొందే అవకాశం కలుగుతుంది. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.