పంట నష్టం నివేదికలు వెంటనే అందజేయాలి
కరోనాపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి
జ్వర సర్వేను విజయవంతం చేయాలి
పకడ్బందీగా దళిత బంధు పథకం అమలు
సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
హాజరైన చీఫ్విప్ దాస్యం, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు
సుబేదారి, జనవరి 23 : అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిసరఫరా శాఖ మత్రి ఎర్రబెల్లి దయకర్రావు అన్నారు. పంట నష్టాల నివేదికలను వెంటనే అందజేయాలని అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన పంట నష్టం, నివేదికలు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కరోనా నివారణ చర్యలు, జ్వర సర్వే, దళిత బంధు పథకం అమలు తీరుపై ఆదివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఛీప్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీ హరి, బస్వరాజు సారయ్య, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్, హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ మారపల్లి సుధీర్కుమార్, మేయర్ గుం డు సుధారాణి, కలెక్టర్లు బీ గోపి, రాజీవ్గాంధీ హన్మంతు, వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ అకాల వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా లో 51 వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నదని, 35 వేల మంది రైతులు నష్టపోయారని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పం ట నష్టం సర్వే చేసి నివేదికలు అందజేయాలని ఆదేశించారు. నర్సంపేట, పరకాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అత్యధికంగా మిర్చి, మొక్క జొన్న పంటలు దెబ్బతిన్నట్లు వివరించారు. ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, తాను, ఎమ్మెల్యేలు కలిసి దెబ్బ తిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించామని తెలిపారు. పంట నష్టపోయిన ప్రతిరైతునూ ఆదుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అందుకు రాజకీయాలు చేయకుండా రైతులకు మనోధైర్యం కల్పించాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులను కోరారు.
వచ్చెల నెల ఐదు లోపు దళిత బంధు లబ్దిదారుల ఎంపిక
రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఇటువంటి పథకం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదని, ఈ పథకంతో దళిత వర్గాలు ఆర్థిక పురోగతిలోకి వస్తాయని మంత్రి చెప్పారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గానికి వంది మంది చొప్పున దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ఫిబ్రవరి ఐదోతేదీ లోపు పూర్తిచేయాలని సూచించారు.
జ్వర సర్వేతో మంచి ఫలితాలు..
కరోనా నివారణ కోసం సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా జ్వర సర్వే చేయిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా చేయడం లేదని పేర్కొన్నారు. జ్వర సర్వేలో మంచి ఫలితాలు వస్తున్నాయని, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు క్షేత్రస్థాయిలో జ్వరసర్వే చేస్తున్నారని చెప్పారు.