మొదటి విడుతలో 50 శాతం మంజూరు
రూ.52.20లక్షలు ఎంఈఓల అకౌంట్లలో జమ
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 417 స్కూళ్లు
ఎస్ఎంసీల తీర్మానం మేరకు పనులు
భూపాలపల్లి రూరల్, జనవరి 22 : సర్కారు బడుల్లో అత్యవసర సమస్యలను పరిష్కరించేందుకు నిధులు విడుదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య, సామాజికవర్గాల వారీగా సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా ఏటా నిధులను కేటాయిస్తున్నది. ఈమేరకు 2021-22 విద్యా సంవత్సరానికి మొదటి విడుతలో 50శాతం మంజూరు చేసింది. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొత్తం 417 పాఠశాలలకు రూ.52.20లక్షలు విడుదల చేసింది. ఆయా నిధులు ఎంఈఓల బ్యాంకు అకౌంట్లలో జమ అయ్యాయి. త్వరలోనే ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ అధ్యక్షుల జాయింట్ అకౌంట్లలో నేరుగా జమ చేయనున్నారు. ఆ తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)ల తీర్మానం మేరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. స్టేషనరీ, చాక్పీస్లు, పత్రికలు, గ్రంథాలయంలో పుస్తకాలు, క్రీడాపరికరాలు, ప్రయోగశాలల పరికరాల కొనుగోళ్లకు, విద్యుత్ బిల్లులు, పరిసరాల పరిశుభ్రత, చిన్న చిన్న మరమ్మతులకు ఉపయోగించవచ్చు.
బడుల బలోపేతానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. గత ఏడాది కొవిడ్ కారణంగా ప్రత్యక్ష తరగతులను ఆలస్యంగా సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించా రు. దీంతో అనేక పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో అత్యవసర పనులు కోసం నిర్వహణ నిధులను విడుదల చేసింది. పాఠశాలలకు గతంలో ఎస్ఎస్ఏ, ఆర్ఎంఎస్ఏ నిధులను వేర్వేరుగా విడుదల చేసేది. వీటిని సమగ్ర శిక్షా అభియాన్లో విలీనం చేసి రెండేండ్లుగా నిధులను మంజూరు చేస్తున్నది. విద్యార్థుల సంఖ్య ప్రకారం, సామాజికవర్గాల ప్రాతిపదికన ఏటా నిధులను కేటాయిస్తున్నది. 2021 -22 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత 50శాతం నిధులను ప్రభుత్వం విడుదల చేసిం ది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాఠశాలల సముదాయాలు, మండల రిసోర్సు కేంద్రాల నిర్వహణకు మొత్తం రూ.52.20లక్షలు విడుదల చేశారు. ఇప్పటికే సంబంధిత మండల విద్యాధికారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి.
జిల్లాలో 417 పాఠశాలలు
జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 417 ఉన్నాయి. వాటిల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ప్రకారం నిధులను విడుదల చేశా రు. 30 మంది ఉంటే రూ.10 వేలు, వంద మంది ఉం టే రూ.25వేలు, రూ.250 మంది ఉంటే రూ.50వేలు. అంతకుమించి ఉంటే రూ.75వేలు, వెయ్యి మందికి పైగా ఉంటే రూ.లక్ష మంజూరు చేస్తారు. ఆయా నిధులతో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)ల తీర్మా నం మేరకు నిధులను ఖర్చు చేయాలి. స్టేషనరీ, చాక్పీస్లు, ఇంటర్నెట్ సేవలు, పత్రికలు, గ్రంథాలయం లో పుస్తకాల కొనుగోళ్లు, క్రీడాపరికరాల సేకరణ, ప్రయోగశాలల పరికరాలు, విద్యుత్ బిల్లులు, ప్రొజెక్టర్ల నిర్వహణ, జాతీయ పండుగల నిర్వహణ, పరిసరాల ను శుభ్రం చేయడం, చిన్న చిన్న మరమ్మతులకు ఉపయోగించవచ్చు. కేటాయించిన నిధుల్లో 10శాతం స్వచ్ఛత కార్యక్రమాలకు వినియోగించాల్సి ఉంటుంది.
సగం నిధులు విడుదల
జిల్లాలోని ఎమ్మార్సీలు, సీఎస్సీలకు ఏటా నిధులను ప్రభుత్వం కేటాయిస్తుంది. ప్రస్తుతం మొదటి విడత సగం నిధులను ఇప్పటికే ఖాతాల్లో జమచేశారు. రెండో విడత నిధులను త్వరలో కేటాయించనున్నారు. మొత్తం నిధుల్లో ఎస్సీ కాంపోనెంట్ కింద 24 శాతం, ఎస్టీ కాంపోనెంట్ కింద 14 శాతం, జనరల్ కాంపోనెంట్ కింద 62శాతం నిధులను ఉపయోగించుకోవా లి. దీని ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 417 పాఠశాలలకు రూ.52,20,450 గ్రాంటు మం జూరైంది. ఎస్టీ కేటగిరీ రూ.7,30,863, ఎస్సీ కేటగిరీ రూ.12,52,908, జనరల్ కేటగిరీ రూ.32,36,679 గ్రాంట్లు మంజూరు చేశారు.
నిబంధనల ప్రకారం వినియోగించాలి
పాఠశాలల నిర్వహణకు గ్రాంట్లు మంజూరయ్యాయి. మొదటి విడుతలో 50శాతం నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ అధ్యక్షుడి సంయుక్త ఖాతాలో నేరుగా జమ అవుతాయి. వీటిని నిబంధనల మేరకు వినియోగించాలి. పాఠశాలల నిర్వహణకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది.